నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. శిఖరాగ్రానికి చేరినంత సంతోషంగా ఉంది. మరో మూడు పోటీల్లో బరిలోకి దిగనున్నా. అందులోనూ పతకాలు సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తా. ఈ క్రీడల్లో దేశానికి మరిన్ని మెడల్స్ వస్తాయని ఆశిస్తున్నా
–అవని లెఖరా
విశ్వక్రీడల్లో పసిడి నెగ్గిన తొలి భారత మహిళగా అవని లెఖరా రికార్డుల్లోకెక్కింది. ఆర్2 మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్ 1 ఈవెంట్లో 249.6 పాయింట్లు సాధించిన అవని ప్రపంచ రికార్డును సమం చేస్తూ పసిడి పట్టింది. కుపింగ్ జాంగ్ (చైనా, 248.9 పాయింట్లు), ఇర్యానా (ఉక్రెయిన్, 227.5 పాయింట్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. కారు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతిన్న 19 ఏండ్ల అవని.. ఓవరాల్గా పారాలింపిక్స్లో భారత్ తరఫున స్వర్ణం నెగ్గిన నాలుగో అథ్లెట్గా నిలిచింది. గతంలో మురళీకాంత్ (స్విమ్మింగ్ 1972), దేవంద్ర ఝఝారియా (జావెలిన్ త్రో 2004, 2016), మరియప్పన్ తంగవేలు (హైజంప్, 2016) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇక పారాలింపిక్స్ షూటింగ్లో భారత్కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. పురుషుల ఆర్వన్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్హెచ్1 ఈవెంట్లో మహవీర్ స్వరూప్ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో కాంస్యం కోల్పోయాడు.
అభినవ్ బింద్రా స్ఫూర్తితో..
చిన్నప్పటి నుంచి చలాకీగా ఉండే అవని జీవితాన్ని.. పదకొండేండ్ల ప్రాయంలో జరిగిన ఓ కారు ప్రమాదం తలకిందులుచేసింది. ఈ దుర్ఘటనలో వెన్నెముకకు తీవ్ర గాయాలవడంతో నడవలేని స్థితికి చేరిన అవని చక్రాల కుర్చీలో నుంచే చరిత్ర తిరుగరాసింది. ఒలింపిక్స్, పారాలింపిక్స్లో కలిపి భారత్ తరఫున స్వర్ణం నెగ్గిన తొలి మహిళగా అవని రికార్డుల్లోకెక్కింది. అనుకోకుండా చదివిన అభినవ్ బింద్రా ఆత్మకథ ‘ఏ షాట్ ఎట్ గ్లోరీ’ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. బీజింగ్ (2008) ఒలింపిక్స్లో భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని అందించిన బింద్రాను ఆదర్శంగా తీసుకొని ఏదో ఒకరోజు ఆ స్థాయి ప్రదర్శన చేయాలని మనసులో బలంగా అనుకున్న అవని.. 2015లో మొదటిసారి గన్ను చేతబట్టింది. అక్కడి నుంచి కుటుంబ సభ్యుల సహకారంతో.. అకుంఠిత దీక్షతో ముందుకు సాగిన అవని జైపూర్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో శిక్షణ పొందింది. 2017లో తొలిసారి పాల్గొన్న అంతర్జాతీయ పోటీల్లోనే రాణించిన అవనికి.. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో చోటు దక్కడంతో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. పాల్గొన్న ప్రతీ పోటీలో తనదైన ముద్ర వేసిన అవని.. టీనేజ్లోనే పసిడి పతకం ఒడిసి పట్టింది. స్వర్ణం నెగ్గిన అనంతరం అవనితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఇతర ఈవెంట్లలోనూ ఇదే ప్రదర్శన కనబర్చి మరిన్ని పతకాలు కొల్లగొట్టాలని స్ఫూర్తినింపారు.
అవనికి 3 కోట్ల నజరానా
టోక్యో పారాలింపిక్స్లో సత్తా చాటిన రాజస్థాన్ ప్లేయర్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతులు ప్రకటించింది. షూటింగ్లో స్వర్ణం గెలిచిన అవనికి రూ.3 కోట్ల రివార్డు ప్రకటిస్తున్నట్టు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక జావెలిన్ త్రోలో రజతం సాధించిన పారా అథ్లెట్ దేవేంద్రకు రూ. 2 కోట్లు, కాంస్యం నెగ్గిన సుందర్ సింగ్కు కోటి రూపాయాల నగదు బహుమతి ఇవ్వనున్నారు. పారాలింపిక్స్లో పతకాలు సాధించినందుకు గాను సీఎం గెహ్లాట్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. నగదు బహుమతులతో పాటు ఈ ముగ్గురికీ రాష్ట్ర అటవీ శాఖలో ఉద్యోగాలు ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు.