దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా ఆల్రౌండర్ స్టార్ రవీంద్ర జడేజా(386 రేటింగ్ పాయింట్లు) రెండోస్థానానికి దూసుకెళ్లాడు. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్(385 పాయింట్లు)ను వెనక్కి నెట్టి జడ్డూ రెండో ర్యాంకు సాధించాడు. టెస్టు ఆల్రౌండర్ల జాబితాలో వెస్టిండీస్ క్రికెటర్ జేసన్ హోల్డర్ 423 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ సెకండ్ ర్యాంకు నిలబెట్టుకున్నాడు.
మరోవైపు ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ముగ్గురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(814 పాయింట్లు), రిషబ్ పంత్(747), రోహిత్ శర్మ(747) వరుసగా 5, 6, 7 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ జాబితాలో నంబర్వన్ బ్యాట్స్మన్గా ఉన్నాడు.