బండి ఆపగానే పార్కింగ్ ఫీజు అంటూ వాలిపోతున్నారా.. ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారా.. ఇక నుంచి పార్కింగ్ ఉచితమే. పార్కింగ్ చేసిన మొదటి 30 నిమిషాల వరకు ఎవరికీ రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. చెల్లించాలని మొండికేస్తే.. ఫొటో తీసి ఈవీడీఎంకు ఆన్లైన్లో లేదా ట్విట్టర్లో షేర్ చేయండి. వెంటనే వాలిపోతారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి ముక్కుపిండి జరిమానాలు వసూలు చేస్తారు.
ఉచిత పార్కింగ్కు తిలోదకాలిచ్చే మాల్స్, మల్టీప్లెక్స్లు, వాణిజ్య సంస్థలపై బల్దియా దృష్టి సారించింది. చాలా చోట్ల మాల్స్, మల్టీప్లెక్స్లు, తదితర వాణిజ్య సంస్థల్లో అడ్డగోలుగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పకడ్బందీగా ఉచిత పార్కింగ్ పాలసీని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామంటూ మాల్స్, మల్టీప్లెక్స్లు, వాణిజ్య సంస్థలకు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం నోటీసులు జారీ చేశారు. దాదాపు 4వేల వరకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇక పౌరులు సైతం అడ్డగోలు దోపిడీని నియంత్రించే ప్రక్రియలో తమ వంతు బాధ్యతను పోషించాలని అధికారులు సూచించారు. అక్రమంగా పార్కింగ్ ఫీజు వసూలు చేసినట్లు తగిన ఆధారాలతో ఫొటో తీసి ఆన్లైన్లో ఈవీడీఎంలోని సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్కు షేర్ చేస్తే పరిశీలించి ఉల్లంఘనులకు జరిమానా విధించనున్నామని డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. ఈవీడీఎం ట్విట్టర్లో కానీ, జీహెచ్ఎంసీ టోల్ఫ్రీ నంబరులో సమాచారం అందిస్తే వెంటనే తమ సిబ్బంది అక్కడికి వెళ్లి వివరాలు తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.