అహ్మదాబాద్: ఇంగ్లాండ్ పేసర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో టీమ్ఇండియా తడబడుతోంది. ప్రత్యర్థి పేసర్లు దూకుడుగా బౌలింగ్ చేస్తుంటే ఆతిథ్య బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. టాప్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ మినహా అందరూ విఫలమవడం జట్టును కలవరపెడుతోంది. గత మూడు టీ20ల్లో భారత్ కోల్పోయిన 16 వికెట్లలో 13 మందిని ఇంగ్లాండ్ పేసర్లు ఔట్ చేయడం గమనార్హం. ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండుసార్లు బౌల్డ్ అయ్యాడు. ఆ జట్టు స్పిన్నర్ అదిల్ రషీద్ కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. టెస్టు సిరీస్ తరహాలో టీ20లకు స్పిన్కు అనుకూలించే పిచ్పై సత్తాచాటి పొట్టి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావించిన భారత్కు ఇంగ్లీష్ జట్టు దిమ్మదిరిగే షాకిచ్చింది.
ఇంగ్లాండ్ పేసర్లు బుల్లెట్ లాంటి బంతులతో బ్యాట్స్మెన్ను వణికిస్తున్నారు. టాప్ ఆర్డర్ను తక్కువ స్కోరుకే పెవిలియన్కు పంపుతూ భారత్ భారీ స్కోరు చేయకుండా కట్టడిచేస్తున్నారు. కీలకమైన నాలుగో టీ20లో కోహ్లీసేన గెలిస్తేనే సిరీస్లో నిలుస్తుంది. లేదంటే మరో మ్యాచ్ మిగిలుండగానే మోర్గాన్ సేన సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఐదు టీ20ల సిరీస్లో భారత్ 1-2తో వెనుకబడ్డ విషయం తెలిసిందే.