అభివృద్ధిలో దూసుకెళ్తున్న ‘అనంతారం’
పల్లెప్రగతి పనులతో మారిన గ్రామ రూపురేఖలు
రోజూ చెత్త సేకరణ
వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, డంపింగ్యార్డులనిర్మాణాలతో కొత్త శోభ ఆకర్షణీయంగా పల్లెప్రకృతివనం
గుండాల, మార్చి 26: మండలంలోని అనంతారం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. గ్రామం లో ఎటు చూసినా పచ్చని చెట్లతో రోడ్లు పరిశుభ్రంగా కనబడుతున్నాయి. ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి విడుదల చేసిన నిధులతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వ నిధులను పక్కా ప్రణాళికతో ఖర్చు చేస్తుండటంతో అభివృద్ధి బాట పట్టింది. డంపింగ్యార్డు, పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం నిర్మాణాలతో గ్రామం సరికొత్త శోభను సంతరించుకున్నది. అనంతారానికి పల్లెప్రకృతి వనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. పల్లెప్రకృతి వనంలో రకరకాల మొక్కలతోపాటు గ్రీనరీని పెంచుతున్నారు. అందులో క్రిస్మస్ మొక్క ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. ప్రతి ఇంటి నుంచి రోజూ చెత్తను సేకరిస్తుండటంతో గ్రామంలోని వీధులన్నీ పరిశుభ్రంగా కనబడుతున్నాయి.
పల్లెప్రగతిలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. అదేవిధంగా నర్సరీలో గ్రామానికి సరిపడా మొక్కలు పెంచి, వాటిని వన సంరక్షుల ద్వారా కాపాడుతున్నారు. గ్రామంలో మొత్తం జనాభా 2,300 మంది ఉండగా అందులో ఓటర్లు 1,610 మంది ఉన్నారు. మిషన్భగీరథ ద్వారా ప్రభుత్వం అందించే తాగునీరు గ్రామం లో ప్రతి ఇంటికీ అందుతున్నది. పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో పారిశుధ్య పనులు, హరితహారం మొక్కల పెంపకం, పాతబావులు, పాతఇండ్లు కూల్చడం, విద్యుత్ లైట్లు ఏర్పాటు వంటి పనులను చేపట్టారు. పన్నుల రూపం లో వసూలైన డబ్బును గ్రామాభివృద్ధికి వినియోగించుకుంటూ పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. రూ. 22లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. సర్పంచ్ తుమ్మ డెన్నీస్రెడ్డి, పంచాయతీ పాలకవర్గం ప్రత్యేక ప్రణాళికతో గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు.