ఖైరతాబాద్, మార్చి 20 : ‘దేశానికి అన్నం పెట్టే రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకువచ్చారు.. లక్షలాది మంది కార్మికులకు నీడనిస్తున్న రైల్వే, బ్యాంకులను ప్రైవేటైజేషన్ చేస్తున్నారు.. గ్యాస్, పెట్రో ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు…బీజేపీ పాలకులను ఇలాగే వదిలేస్తే దేశాన్నే ప్రైవేటీకరణ చేస్తారు’ అని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. శనివారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ నేతలు అనుసరిస్తున్న ప్రజా, దేశ వ్యతిరేక విధానాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. దేశంలో దళిత వ్యతిరేక పాలన నడుస్తున్నదని, బీజేపీ నాయకులు దళిత అధికారులపై దాడులు, కుట్రలు, అసత్యపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. దళితుల అభివృద్ధిని బీజేపీ సహించడం లేదన్నారు. కాషాయం జెండాకు ప్రత్యామ్నాయం నీలి జెండాలేనని, ఆ దిశగా దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు నీలి దుస్తులను ధరించి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు.
ఏప్రిల్ 14న భారీ నీలి కవాతు..
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ.. కాషాయికరణకు వ్యతిరేకంగా రాష్ట్రం లో బ్లూషర్ట్స్ ఉద్యమానికి శ్రీకారం చుట్టామన్నారు. నీలి చొక్కా ఉద్యమంలో కాషాయం కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఈ సారి ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుతున్నామన్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ట్యాంక్బండ్ వద్దగల బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బ్లూ షర్ట్స్ ధరించి, నీలి జెండాలతో భారీ కవాతు నిర్వహించనున్నామన్నారు. సమావేశంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పెద్దలింగన్నగారి శంకర్, వివిధ సంఘాల నాయకులు మైసా ఉపేందర్, గడ్డం యాదయ్య, ఎర్రవెల్లి కృష్ణ మాదిగ, వినాయక రావు, ముత్యపాక నర్సింగ్రావు, బచ్చలకూర బాలరాజు, మీసాల మహేశ్, వెల్పుగొండ వెంకటేశ్, దేవరకొండ నరేశ్, బోరెల్లి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.