అతనో పాటల సిరి. కమ్మని పదబంధాలతో శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేయగల అక్షరమందార గిరి.సుమనోహర భావాలతో సినీ ప్రేక్షకులను తన్మయత్వంలో తేలియాడించగల మధుర కవితా ఝరి..సాయిసిరి.
కవిగా, సినీ గేయ రచయితగా సుపరిచితులైన సాయిసిరి అసలు పేరు సాయికుమార చారి. స్వస్థలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తాండూర్. తల్లిదండ్రులు పార్వతమ్మ, శ్రీ దుర్గాచారి. 1975 జూలై 10న జన్మించిన సాయిసిరి, తాండూర్లో మాధ్యమిక విద్య, నాగార్జునసాగర్ గురుకుల పాఠశాలలో ఉన్నత విద్య అభ్యసించారు. సైఫాబాద్ కళాశాలలో డిగ్రీ చేశారు. ప్రస్తుతం, మెదక్ జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. సాయిసిరి రాసిన 200లకు పైగా కవితలు పలు దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి. నిరంతర సాహిత్యాధ్యయనం తన అలవాటు. వందకు పైగా ప్రైవేటు గీతాలు రాశారు. అందులో ‘తెలంగాణ జననీ నీకు వందనం.. తెలంగాణ పుడమి ఓ వజ్ర మందిరం’ అనే పాట ఆయనకు ఎనలేని గుర్తింపును తెచ్చింది.
తొలి అడుగే.. సందేశాత్మకం!
సినీ నేపథ్య గాయకుడు జై శ్రీనివాస్ ప్రోత్సాహంతో చిత్రసీమలోకి వచ్చారు సాయిసిరి. ‘గెలిచేటట్టు ఆడరా.. నిలిచేటట్టు పాడరా’ అంటూ రాసిన సందేశాత్మక గీతంతో సినీరంగంలో తొలి అడుగు వేశారు. 2012లో వచ్చిన ‘భిక్కు రాథోడ్’ సినిమాకోసం ఈ పాటను అందించారాయన. ప్రగతి పథంపైన నడిచిపొమ్మని, చరిత్ర సృష్టించే దిశగా సాగిపొమ్మని యువతకు చెబుతుందీ పాట. ఇందులోని ‘లైఫ్ స్టోరీకి గొప్ప రైటర్ నీకు నువ్వేరా.. మనిషి పుట్టుకే వరమురా.. మట్టయ్యేవరకే నీదిరా’ అనే పంక్తుల్లో, ప్రతి మనిషీ తన జీవితమనే కథను తానే రాసుకోవాలని, మనిషిగా పుట్టడమే గొప్ప వరమని, మట్టిలో కలిసి పోయేవరకూ నిరంతర శ్రమతో సాగిపోవాలని మహోన్నతంగా చాటి చెప్పారు. ఆ తర్వాత ‘ఒక్కడితో మొదలైంది’ (2013) చిత్రంలోనూ థీమ్సాంగ్ను రాశారు. ‘కదనం కదనం.. కాసుల వేటకు వదిలెను కవనం’ అంటూ సాగే ఈ పాటద్వారా కొండాకోనల్లో నిధికోసం నిరంతరాన్వేషణ చేస్తూ ఓ యువసమూహం సాగించే పయనాన్ని, వాళ్ల ప్రాణాంతకమైన గమనాన్ని వివరించారు. సినిమాలో ఆశ్చర్యాన్ని రేకెత్తించే సంఘటనలకు అక్షరరూపంగా ఈ పాటను మలిచారు. ‘ఒక్కొక్కరిది ఒక్కో చరితం.. దిక్కులు తోచని అడవిలో భవితం.. గాలిలో దీపం గుడ్డి ప్రయాణం’ అనే వాక్యాల్లో, తమ కష్టాల్ని పోగొట్టుకోవడానికి గమ్యం తోచని దారిలో నడక సాగిస్తూ, అదృష్టాన్ని పరీక్షించుకోదలచిన యువత ధైర్య సాహసాలను ఎలుగెత్తి వినిపించారు.
ప్రణయగీతాలూ
ప్రేమ సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు మనసు పడే తపనను వివరిస్తూ యువతకోసం పలు ప్రణయగీతాలనూ అందించారు సాయిసిరి. ‘దారాసింగ్’ (2015) సినిమాకోసం
‘ఎలోన్గా ఉన్నా ఏంజెల్ను నేనేరా.. ఏమైనా చేసుకోరా’ అంటూ సాగే ఓ వినసొంపైన పాట రాశారు. ప్రియుడిని తన వలపు సన్నిధికి రప్పించే నెపంతో ప్రేయసి పాడే ప్రణయ గీతమిది. ‘పెదవికి తెలియని రుచినందించి తీపిని పుట్టించు.. నీ తనువుకు తెలియని కౌగిలినిచ్చి వేడిని రప్పించు’ వంటి వాక్యాల్లో తీరని దాహమున్న వయసు తాపం నిండుగా కనిపిస్తుంది. పదాలకు తగిన భావవ్యక్తీకరణ కూడా ఎంతో గొప్పగా సాగుతుంది. ఆ తర్వాత, 2017లో వచ్చిన ‘సాగరతీరంలో’ చిత్రంలో ‘మీ అమ్మ నాన్న ఓకే అన్నారు.. మా అమ్మనాన్న ఒప్పుకొన్నారు’ అంటూ మరో హుషారు గీతం రాశారు. తీయని అనుభూతుల్ని, పులకింతల్ని ఎంతో మధురంగా తెలియజేశారు. ‘నువ్వు నాకు ఉడ్బి ఉడ్బి వైఫ్ వే.. నేను నీకు ఉడ్బి ఉడ్బి హస్బెండ్నే..’ అంటూ సాగే పంక్తులతో యూత్కి మరింత ఊపునిచ్చారు.
ఎగిసిన చైతన్య తరంగం
ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని, సంకల్పాన్ని రగిలించే చైతన్య గీతాలెన్నో సాయిసిరి కలం నుంచి జాలు వారాయి. 2018లో వచ్చిన ‘డోరా’ సినిమాలో ‘రా రా స్పీడుగా.. రా పాత బాకీ తుడిమి వేస్తా రా’ అంటూ సాగే పాట శత్రువులను మట్టుపెట్టి ప్రతీకారాన్ని తీర్చుకునే దిశగా సాగుతుంది. అన్యాయానికి ఎదురుతిరిగే సాహసమై దూసుకెళ్తుంది. ‘రా రా పోటుగా రా.. పోటీపడి ఓటమితో పో రా’ అనే వాక్యాలు శత్రువు ఎంతటి బలవంతుడైనా ఢీకొనే తెగువను కలిగి ఉండాలనే విశ్వాసాన్ని, సంకల్పాన్ని కలిగిస్తాయి.‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ (2019) చిత్రం కోసం ఓ యుగళ గీతాన్ని రాశారు. ‘మాషాల్లాహ్.. నా మనసును తాకిన తారవయ్యో.. నీ సరసున చేరిన చేపనయ్యో’ అని సాగుతుందీ పాట. ప్రేమతో చిందేసిన హృదయాల్లోని తీపి తలపుల సవ్వడి ఇందులో కనబడుతుంది. ప్రేయసీ ప్రియులకు ఒకరిపై ఒకరికున్న అనంత ప్రేమభావాల్ని ఎంతో సహజంగా
ఆవిష్కరిస్తుంది.
మోటుదనం.. జానపదం
కొంటె పదాలతో ఘాటుగా, మోటుగా జానపద రీతిలో సాగే పాటలను రాయడంలోనూ సాయిసిరి నేర్పరి. 2020లో వచ్చిన ‘1995 వైశాల్యపురంలో ఊర్వశి’ చిత్రం కోసం అలాంటి ఓ గీతాన్ని అందించారు. ‘ఓ గుంట సేను కొత్తావా పంట పనులన్నీ సూపిత్తా.. ఓ గుంటా వెంటే ఉంటావా? కొంటె ఆటలన్నీ నేర్పిత్తా’ అని కాస్త మోటుగా సాగుతుందీ పాట. తేలికైన పదాల సొబగు, భావరీతితో ఈ పాటకు ప్రత్యేకమైన వన్నెలద్దారు సాయిసిరి. లాలిత్యమైన శృంగారం ఈ పాటలో ప్రధానంగా కనిపిస్తుంది. ఈ సినిమాలోని అన్ని పాటలూ, వీరి కలం నుంచే జాలువారాయి. ప్రతి పాటనూ శబ్దపటిమతో, నిండైన శిల్పంతో రూపొందించి, గీత రచయితగా తన స్థానాన్ని పదిల పరుచుకునే దిశగా సాగుతున్నారు సాయిసిరి.
-తిరునగరి శరత్ చంద్ర, 6309873682