దుబాయ్: ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఇప్పటికే ఈ మిగిలిన టోర్నీని యూఏఈకి తరలించిన విషయం తెలిసిందే. దీనిపై అక్కడి బోర్డుతో చర్చించడానికి శుక్లా యూఏఈ వెళ్లారు. మరో రెండు రోజుల్లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జే షా, ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ కూడా యూఏఈ రానున్నట్లు ఈ సందర్భంగా రాజీవ్ శుక్లా వెల్లడించారు. అక్కడి ప్రముఖ పత్రిక ఖలీజ్ టైమ్స్తో ఆయన మాట్లాడారు. తాము ఇక్కడి క్రికెట్ బోర్డుతో చర్చలు జరపనున్నామని, ఆ తర్వాత షెడ్యూల్ తయారు చేస్తామని శుక్లా చెప్పారు. గతేడాది ఇక్కడ జరిగినట్లే ఈసారి కూడా టోర్నీ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
ఇక స్టేడియాల్లో అభిమానులకు అనుమతి ఇస్తారా లేదా అన్న ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చేతుల్లో ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్లో ఇప్పటికే 29 మ్యాచ్లు ముగియగా.. మరో 31 జరగాల్సి ఉన్నాయి. అభిమానులను స్టేడియాలకు అనుమతించినా, లేకపోయినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా శుక్లా స్పష్టం చేశారు. ఇండ్లండ్లో టెస్ట్ సిరీస్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 18న ఐపీఎల్ ప్రారంభమయ్యే అవకాశాల ఉన్నట్లు ఆయన చెప్పారు.
అయితే మిగిలిన మ్యాచ్కు పలువురు విదేశీ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఈ అంశంపై కూడా తాము చర్చించినట్లు శుక్లా తెలిపారు. ఎవరు వచ్చినా రాకపోయినా ఈ టోర్నీని పూర్తి చేయడంపైనే మేము దృష్టి సారించాం. దీనిని ఇలా మధ్యలో వదిలి వేయలేం. వచ్చిన వాళ్లతోనే టోర్నీ నిర్వహిస్తాం అని ఆయన తేల్చి చెప్పారు. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లతో ఫ్రాంచైజీలు మ్యాచ్లకు సిద్ధమవుతారని అన్నారు. టోర్నీ ప్రారంభానికి ముందే ప్లేయర్స్ అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామనీ చెప్పారు.