న్యూఢిల్లీ: అర్ధాంతరంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను నిర్వహించేందుకు బీసీసీఐ చేస్తున్న కసరత్తులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 18 లేదా 19న యూఏఈ వేదికగా సీజన్ రెండో దశను ప్రారంభించాలని బీసీసీఐ ఖరారు చేసిందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ మూడో వారంలో మ్యాచ్లను మొదలుపెట్టి.. అక్టోబర్ 10న ఫైనల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిందని ఓ అధికారి మంగళవారం వెల్లడించారు. మూడు వారాల వ్యవధిలో 31 మ్యాచ్ల నిర్వహణ ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్లు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆలోచిస్తున్నదని చెప్పారు. ‘భాగస్వాములందరితో బీసీసీఐ మాట్లాడింది. సెప్టెంబర్ 18 లేదా 19న మ్యాచ్లు మొదలయ్యే అవకాశాలున్నాయి. అలాగే వారాంతాలైన అక్టోబర్ 9 లేదా 10న ఫైనల్ జరుగనుంది. షెడ్యూల్లో 10 డబుల్ హెడర్లు, ఏడు రాత్రి మ్యాచ్లు, నాలుగు నాకౌట్ మ్యాచ్లు (రెండు క్వాలిఫయర్లు, ఓ ఎలిమినేటర్, ఫైనల్) ఉంటాయి. మొత్తంగా మిగిలిన 31 మ్యాచ్లు జరుగుతాయి’ అని ఆ అధికారి వివరించారు. కాగా బయోబబుల్లో ఉన్న కొందరు ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకడంతో ఈనెల 4న ఐపీఎల్ 14వ సీజన్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
భారత్, ఇంగ్లండ్ ప్లేయర్లు ఒకే విమానంలో..
టీమ్ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ మాంచెస్టర్లో సెప్టెంబర్ 14న ముగియనుంది. ఆ తర్వాతి రోజే రెండు జట్ల ఆటగాళ్లను ఒకే ప్రత్యేక విమానంలో యూఏఈకి తరలించాలని బీసీసీఐ ప్రణాళిక రచించింది. బయోబబుల్ నుంచి మరో బబుల్లోకి వస్తుండడంతో మూడో రోజుల క్వారంటైన్ సరిపోతుందని భావిస్తున్నది. అదే విధంగా కరీబియన్ ప్రీమియర్ లీగ్ కూడా అప్పట్లోగా ముగియనుండడంతో వెస్టిండీస్ ప్లేయర్లు సైతం వచ్చే అవకాశం ఉంటుంది. ‘మాంచెస్టర్ నుంచి దుబాయ్కి భారత్, ఇంగ్లండ్ ప్లేయర్లు ఒకే ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. వెస్టిండీస్ ప్లేయర్లు సీపీఎల్ బబుల్ నుంచి వస్తారు. కాబట్టి బ్రిటన్, కరీబియన్ నుంచి వచ్చే ప్లేయర్లకు మూడో రోజుల క్వారంటైన్ ఉంటుంది’ అని బీసీసీఐకి చెందిన అధికారి చెప్పారు. కాగా సెప్టెంబర్ 15 నుంచి 20 మధ్య ఐపీఎల్ ప్రారంభానికి సిద్ధంగా ఉండాలని బీసీసీఐ నుంచి తమకు సమాచారం అందిందని ఓ ఫ్రాంచైజీకి చెందిన అధికారి పేర్కొన్నారు.
సఫారీలతో సిరీస్ రద్దు
సెప్టెంబర్లో దక్షిణాఫ్రికాతో భారత్ ఆడాల్సిన టీ20 సిరీస్ను రద్దు చేసుకునేందుకు బీసీసీఐ నిర్ణయించింది. టీ20 ప్రపంచకప్ ఆతిథ్యానికి ఏర్పాట్లు చేసుకోవాల్సిన నేపథ్యంలో ఈ సిరీస్ సాధ్యం కాదని భారత బోర్డు తేల్చేసింది. అలాగే సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య ఐపీఎల్ రెండో దశ నిర్వహించేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో ఈ సిరీస్ అసాధ్యమవుతున్నది. మరోవైపు ఐపీఎల్ ముగిసిన 10 రోజుల వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్ మొదలయ్యేలా బీసీసీఐ ఆలోచిస్తున్నది. అయితే వచ్చే ఏడాది ప్రారంభంలో సఫారీలతో భారత్ పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడే అవకాశం ఉంది.
న్యూజిలాండ్తో వాయిదా
నవంబర్లో సొంతగడ్డపై న్యూజిలాండ్తో భారత్ ఆడాల్సిన రెండు టెస్టుల సిరీస్ వాయిదా పడడం ఖాయంగా మారింది. టీ20 ప్రపంచకప్ ముగింపు తేదీలను బట్టి ఈ సిరీస్ ఎంత కాలం ఆలస్యంగా నిర్వహించాలనేది బీసీసీఐ నిర్ణయించనుంది. మరోవైపు ప్రస్తుతం కరోనా పరిస్థితులు దేశంలో తీవ్రంగా ఉన్నా అక్టోబర్ నాటికి అంతా సద్దుమణిగి టీ20 మెగాటోర్నీ నిర్వహించే వాతావరణం ఏర్పడుతుందని బీసీసీఐ విశ్వాసం వ్యక్తం చేస్తున్నది.