ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ అక్కడే.. ఎస్జీఎంలో బీసీసీఐ నిర్ణయం
న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ నిర్వహణ కోసం తీవ్ర కసరత్తులు చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యూఏఈకే ఓటేసింది. కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఈ ఏడాది టోర్నీలో మిగిలిన 31 మ్యాచ్లను సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య అరబ్ ఎమిరేట్స్లో జరుపాలని తీర్మానించింది. ఐపీఎల్తో పాటు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై శనివారం వర్చువల్గా జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంది. ‘ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లను యూఏఈలో సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఎస్జీఎం ఆమోదించింది. తేదీలు త్వరలోనే వెలువడతాయి. సెప్టెంబర్ సమయంలో భారత్లో వానకాలం ఉంటుంది. అలాగే యూఏఈలోని ఆ మూడు స్టేడియాల్లో (దుబాయ్, షార్జా, అబుదాబి) టోర్నీ నిర్వహించడం సులభం. 2020లోనూ అదే చూశాం’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే ఎమిరేట్స్ బోర్డుతో బీసీసీఐ చర్చలు జరుపుతున్నది. కాగా సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 10 వరకు ఐపీఎల్ జరిగే అవకాశం ఉంది. బయోబబుల్లో ఉన్న ఆరుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్గా తేలడంతో మే 4న 14వ సీజన్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. కాగా కరోనా తీవ్రత ఉన్నా గతేడాది ఐపీఎల్ యూఏఈ వేదికగా సజావుగా సాగిన సంగతి తెలిసిందే.
ప్రపంచకప్పై నిర్ణయానికి మరో నెల
భారత్లో కరోనా వైరస్ పరిస్థితులు మారుతుండడంతో టీ20 ప్రపంచకప్ ఆతిథ్యంపై తుది నిర్ణయం తీసుకునేందుకు మరో నెల సమయం తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఐసీసీకి చెప్పి గడువు కోరనుంది. జూలై 1 తర్వాత నిర్వహించే ఎస్జీఎంలో అక్టోబర్లో జరుగాల్సిన మెగాటోర్నీపై నిర్ణయం ఉంటుందని బీసీసీఐ అధికారి చెప్పారు.
దుబాయ్కి గంగూలీ, షా
అక్టోబర్లో భారత్ వేదికగా జరుగాల్సిన టీ20 ప్రపంచకప్పై ఐసీసీ బోర్డు సమావేశంలో చర్చించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా సోమవారం దుబాయ్కి వెళ్లనున్నారు. ఐసీసీ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా వారితో పయనమవనున్నారు. మెగాటోర్నీపై నిర్ణయం కోసం నెల గడువు సహా పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాలపై చర్చ సాగనుంది. అలాగే కరోనా నేపథ్యంలో ముంబై, పుణె స్టేడియాలకే ప్రపంచకప్ను పరిమితం చేసే విషయంపైనా మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు ఐపీఎల్ నిర్వహణపై ఎమిరేట్స్ బోర్డు అధికారులతో దాదా, షా చర్చించనున్నారు.