ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021లో పాల్గొన్న ఆస్ట్రేలియా బృందం ఎట్టకేలకు తమ ఇళ్లకు చేరుకున్నది. ఆస్ట్రేలియా ప్రభుత్వం సిడ్నీలో ఏర్పాటు చేసిన 14 రోజుల క్వారంటైన్ను పూర్తి చేసుకొని సోమవారం ఇళ్లకు చేరుకున్నారు. 38 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కామెంటేటర్లు, సహాయక కోచింగ్ సిబ్బంది దాదాపు రెండు నెలల తర్వాత తమ కుటుంబ సభ్యులను కలవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను సంతోషంలో దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్మీడియాలో షేర్ చేశారు.
సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ ఇంటికి చేరుకోగానే తన చిన్న కూతురుని ఎత్తుకొని సంబరపడిపోయాడు. మిగతా ఆటగాళ్లు కూడా తమ ఆత్మీయులను హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్ధంతరంగా ఆగిపోవడంతో ఆసీస్ బృందం నేరుగా మాల్దీవులకు వెళ్లారు. విదేశాల నుంచి వచ్చే వారిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం మే 15 వరకు నిషేధం విధించడంతో ఆ గడువు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి అనంతరం స్వదేశానికి చేరుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరి 14 రోజుల క్వారంటైన్ పూర్తైన తర్వాత తాజాగా తమ ఇళ్లకు వెళ్లిపోయారు.