న్యూఢిల్లీ: ఐపీఎల్-14వ సీజన్ రెండో దశ ప్రారంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కోచ్ను మార్చింది. తొలి దశ మ్యాచ్లకు సైమన్ కటిచ్ కోచ్గా వ్యవహరించగా.. ఇకపై ఆ బాధ్యతలను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెసెన్కు అప్పగించింది. వ్యక్తిగత కారణాల వల్ల కటిచ్ తప్పుకున్నట్లు శనివారం పేర్కొన్న ఫ్రాంచైజీ.. జట్టులోనూ కొన్ని కీలక మార్పులకు నడుం బిగించింది. ఇటీవల టీమ్ఇండియాతో వన్డే, టీ20 సిరీస్ల్లో రాణించిన శ్రీలంక యువ స్పిన్నర్ వణిండు హసరంగను జట్టులోకి తీసుకున్న బెంగళూరు.. దుష్మంత చమీరా, టిమ్ డావిడ్లకూ జట్టులో చోటు కల్పించింది. ఐపీఎల్లో ఆడనున్న తొలి స్విట్జర్లాండ్ ఆటగాడిగా డావిడ్ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు.
డానియల్ సమ్స్, ఆడమ్ జంపా, ఫిన్ అలెన్ల స్థానంలో రిప్లేస్మెంట్గా ఈ ముగ్గురిని ఎంపిక చేసుకుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ నెగ్గని బెంగళూరు ఈ సారి ఎలాగైనా విజేతగా నిలువాలని పట్టుదలతో ఉంది. మొదటి దశలో 7 మ్యాచ్లు ఆడిన కోహ్లీసేన.. అందులో ఐదింట నెగ్గి మంచి స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. జట్టు ఆటగాళ్లు ఈ నెల 29న యూఏఈకి చేరుకోనున్నట్లు ఫ్రాంచైజీ అధికారి తెలిపారు.