ముంబై: కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్లను ఈ సెప్టెంబరు-అక్టోబరులో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. లీగ్లో మిగిలిన 31 మ్యాచ్లను యూఏఈ వేదికగా నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. వాయిదా పడిన లీగ్ను ఎక్కడ, ఎలా, ఏ విండోలో నిర్వహించాలి, తదితర అంశాలపై తుది నిర్ణయాన్ని మే 29న జరిగే బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో తీసుకోనున్నారు.
ఈ సమావేశానికి ముందే టోర్నీలో మిగతా మ్యాచ్ల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2021 సెప్టెంబర్ 19 లేదా 20న తిరిగి ప్రారంభమవుతుందని, ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 10న జరిగే అవకాశం ఉందని ఇండియా టుడే ఓ కథనంలో పేర్కొంది. ఇందులో 10 డబుల్ హెడర్ మ్యాచ్లు, 4 ప్లేఆఫ్ రోజులు ఉండే అవకాశం ఉంది.
భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ సెప్టెంబర్ 14న ముగియనుంది. సిరీస్ ముగియగానే భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు సెప్టెంబర్ 15న దుబాయ్ చేరుకోనున్నారు. టోర్నీ ఆరంభానికి ముందు వీరందరూ 3 రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు. ఆటగాళ్లందరూ బయో బబుల్ నుంచి మళ్లీ మరో బబుల్లోకి వెళ్తున్నందుకు కఠిన క్వారంటైన్ అవసరంలేదని బోర్డు భావిస్తోంది. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేయాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును..బీసీసీఐ అడిగే అవసరంలేదని తెలుస్తోంది.