ఇబ్రహీంపట్నం, జూన్ 30: వైద్యో నారాయణో.. హరి అంటే వైద్యుడు నారాయణుడితో సమానం అని పెద్దలు చెప్పారు. కష్టకాలంలో వ్యాధిగ్రస్తుల ప్రాణాలు కాపాడి, వారికి శారీరక, మానసిక ైస్థెర్యాన్ని అందించేందుకు వారు నిత్యం కృషి చేస్తుంటారు. ఊపిరిపోసుకున్న పసికందు నుంచి పండు ముసలి వరకు అందరికీ ఆరోగ్య ప్రదాతలుగా నిలుస్తున్నారు. వైద్యులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఒక రోజుంది. అదే డాక్టర్స్ డే. ప్రతి వృత్తి దేనికదే సాటి అయినప్పటికీ వైద్య వృత్తి వాటికి భిన్నమైనది. మృత్యువు చివరి అంచులదాకా వెళ్లినా వారికి ప్రాణం పోసే శక్తి ఈ వృత్తికి ఉంటుంది. అందుకే వైద్య వృత్తి పవిత్రమైనది. మానవసేవే, మాధవసేవ అన్నట్లు సాగే వైద్య వృత్తిలో ఎదుటి వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు తపనపడే వారే నిజమైన వైద్యులు. డాక్టర్లకు సహనం, ఓర్పు, సేవానిరతి, దయ ఉండాలి. తాము చేస్తున్న వృత్తిమీద అభిరుచి, నమ్మకం ఉండాలి. జీవనోపాధికోసం కాకుండా తాము చేస్తున్న పని ఒక క్రమబద్ధతగా ఉండాలి. ఫీజు తీసుకున్నా, తీసుకోకపోయినా తన సేవ ఒకేలా ఉండాలి. రోగికి వైద్యుడికి మధ్య నమ్మకం అనే బంధం కలిగి ఉండాలి.
వైద్యుల కోసం ఒక రోజు..
అనారోగ్యం బారినపడిన వారికి అనుక్షణం వైద్యం అందిస్తూ వారికి మనోధైర్యం కల్పించే వారు డాక్టర్లు.అందుకే వీరికోసం ప్రపంచమంతా ఒకరోజు కేటాయించింది. డాక్టర్లంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తారు.
డాక్టర్స్డే చరిత్ర..
మన దేశంలో ప్రతి ఏటా జులై 1న నేషనల్ డాక్టర్స్డేగా జరుపుకొంటున్నాం. ప్రముఖ వైద్యుడు బీసీరాయ్ గౌరవార్థం ఈ రోజును నిర్ణయించారు. ఆయన 1882 జులై 1న జన్మించారు. మన దేశంలో వైద్యారంగానికి ఎనలేని సేవలందించారు. ఆయన 1962 జులై 1న మరణించారు. డాక్టర్ బీసీరాయ్ పుట్టినరోజు, మరణించిన రోజు జులై ఒకటో తేదీ కావడం విశేషం. ఆయన జయంతి, వర్దంతిల సందర్భంగా ప్రతి ఏటా నేషనల్ డాక్టర్స్ డేను నిర్వహిస్తున్నారు.