ముంబై: ఐపీఎల్-2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండ్షోతో అదరగొడుతోంది.
వరుస విజయాలతో కోహ్లీసేన దూసుకుపోతోంది. హ్యాట్రిక్ విజయంతో జోరుమీదున్న బెంగళూరు ఈ సీజన్లో తొలిసారి వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ఆడబోతోంది. వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్తో బెంగళూరు తలపడనుంది. రాజస్థాన్పై టాస్ గెలిచిన బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. పటిదార్ స్థానంలో కైల్ రిచర్డ్సన్ను తీసుకున్నట్లు కోహ్లీ చెప్పాడు. మరోవైపు జయదేవ్ ఉనద్కత్ స్థానంలో శ్రేయస్ గోపాల్ను ఎంపికచేసినట్లు శాంసన్ వెల్లడించాడు.
ఐపీఎల్లో ఇరుజట్లు 23సార్లు తలపడగా బెంగళూరు 13సార్లు గెలవగా..రాజస్థాన్ 10సార్లు విజయం సాధించింది. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒకటి గెలిచి రెండింట్లో పరాజయం పాలైన రాజస్థాన్ తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తోంది. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నా సమిష్టిగా రాణించడంలో విఫలమవుతోంది రాజస్థాన్.