జగిత్యాల : దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు పింఛన్లు, వారికి అవసరమైన అధునాతన ఉపకరణాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ఏడీఐపీ పథకం క్రింద ధర్మపురి నియోజకవర్గంలోని దివ్యాంగులకు మంజూరైన ఉపకరణాలను శనివారం మండల కేంద్రంలో ఆయన పంపిణీ చేసి మాట్లాడారు.దివ్యాంగులకు రూ.1500 పింఛన్ను ప్రభుత్వం రూ. 3 వేలకు పెంచిందని గుర్తుచేశారు. కార్పొరేషన్ రుణాలు, డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులోనూ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
రూ. 22 కోట్ల వ్యయంతో 36 లక్షల ఉపకరణాలను కేటీఆర్ చేతుల మీదుగా శుక్రవారం హైదరాబాద్లో అర్హులకు పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు. అనంతరం పెగడపల్లి, గొల్లపల్లి ధర్మపురి, వెలగటూరు మండలాలకు చెందిన 74 మంది దివ్యాంగులకు బ్యాటరీ ఆధారిత ట్రైసైకిళ్లు అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జీ రవి, జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంతం, డీసీఎంఏస్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైరపర్సన్ సంగి సత్తెమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, జట్పీటీసీ అరుణ, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి