వన్య ప్రాణుల కోసం నీటి వనరులు
తాళ్లపేట రేంజ్లో 38 సాసర్పిట్స్ ఏర్పాటు
జంతువుల దప్పిక తీర్చేందుకు అటవీ శాఖ చర్యలు
దండేపల్లి, మే 9 : వేసవి వచ్చిందంటే చాలు.. తాగునీటికి కటకట తప్పదు. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ నదులు, వాగులు, వంకలు, బోరుబావులు, చెరువులు ఎండిపోతుంటాయి. ప్రజలకే కాదు.. మూగ జీవాలకూ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ నేపథ్యంలో వన్యప్రాణులు దాహం తీర్చేందుకు అటవీశాఖ రక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నీటి తొట్లు నిర్మించారు. కుంటల్లో ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
దండేపల్లి మండలంలోని తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలో అడవి జంతువులను కాపాడడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రేంజ్ పరిధిలో గతంలో 33 సాసర్పిట్స్ ఉండేవి. ఈ యేడాది మరో ఐదింటిని నిర్మించారు. ఎండాకాలం వచ్చిందంటే దాహంతో అల్లాడిపోయి వన్యప్రాణులు మృత్యువాత పడిన సందర్భాలున్నాయి. తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చాక వన్యప్రాణుల సంరక్షణకు నడుం బిగించింది. వేటగాళ్ల కదలికలను పసి గట్టడం కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.
అటవీ ప్రాంతంలో నీటి తొట్లు..
వేసవిలో జంతువులు దాహార్తితో అలమటిస్తూ, నీటి కోసం గ్రామాల వైపు వస్తుంటాయి. దీనిని అదునుగా భావించి, గ్రామస్తులు దాడులు చేయడం వంటి సంఘటనలు గతంలో చాలా చోటుచేసుకున్నాయి. దాహం తీర్చుకోవడానికి రోడ్డు దాటుతూ ప్రమాదాల్లో వన్యప్రాణులు మృత్యువాత పడిన సందర్భాలు అనేకం. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి నీటి తొట్లు ఏర్పాటు చేశారు. చిన్నచిన్న జంతువులు కూడా స్వేచ్ఛగా నీరు తాగేందుకు వీలుగా తక్కువ ఎత్తుగల పిట్ను తయారు చేసి వారానికోసారి, రెండు సార్లు ట్రాక్టర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. వీటి నిర్వహణ స్థానిక బీట్ అధికారులు, బేస్ క్యాంపు సిబ్బంది చూసుకుంటున్నారు. నీటి కుంటల్లో కూడా నీటిని నింపుతున్నారు. తాళ్లపేట రేంజ్ పరిధిలో సహజసిద్ధంగా వచ్చే నీటిని సిబ్బందితో కాలువలు తీయించి నీటి తొట్లలోకి నీటిని పంపుతున్నారు. వీటితో పాటు నీటి నిల్వల కోసం కరకట్టలు నిర్మించి వాటిలోనూ నీళ్లు పోస్తున్నారు. వాగులు, సెలయేళ్లలో చెలిమెలు సైతం తీస్తున్నారు. సాసర్ పిట్(నీటి తొట్లు) పరిసరాల్లో వన్యప్రాణుల సంచారం వివరాలు తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వన్యప్రాణులు తాగునీటి కోసం వచ్చినప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్నాయి. ఎలుగుబంట్లు, జింకలు, దుప్పులు, నీలుగాయిలు, సాంబార్లు, నెమళ్లు, అడవిపందులు, అడవిదున్నలు, కుందేళ్లు తదితర వన్యప్రాణులు తాగునీటి కోసం సాసర్పిట్ల వద్ద దాహం తీర్చుకుంటున్నాయి.