ఫైనల్లో లంకపై సచిన్ సేన గెలుపు
రాయ్పూర్: సచిన్ టెండూల్కర్ సారథ్యంలో భారత దిగ్గజాలు గర్జించారు. రోడ్ సెఫ్టీ ప్రపంచ సిరీస్ తుదిపోరులో శ్రీలంకను చిత్తుచేసి టైటిల్ కైవసం చేసుకున్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో ఇండియన్ లెజెండ్స్ జట్టు 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్పై ఘన విజయం సాధించింది. ఆల్రౌండర్ యూసుఫ్ పఠాన్ (36 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్స్లు) బ్యాటింగ్లో రెచ్చిపోవడంతో పాటు బౌలింగ్లో లంక స్టార్లు సనత్ జయసూర్య (43), దిల్షాన్ (21) ను ఔట్ చేసి భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. యూసఫ్ సహా యువరాజ్ సింగ్ (41 బంతుల్లో 60) దుమ్మురేపడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సచిన్సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. కెప్టెన్ టెండూల్కర్ (30) ప్రారంభంలో దూకుడుగా ఆడి శుభారంభాన్నిచ్చాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో లంక లెజెండ్స్ టీమ్ తడబడింది. చివర్లో వీరవర్దెనె (38), జయ సింఘె (40) దూకుడుగా ఆడినా ఏడు వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో యూసఫ్, ఇర్ఫాన్ చెరో రెండు, మునాఫ్, గోనీ తలా ఓ వికెట్ తీసుకున్నారు. దిల్షాన్కు మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది.