పుణె చేరిన టీమ్ఇండియా
పుణె: ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు పుణె చేరుకుంది. అహ్మదాబాద్లో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను 3-2తో కైవసం చేసుకున్న కోహ్లీసేన ఆదివారం ఇక్కడ అడుగుపెట్టింది. ఈ నెల 23, 26, 28 తేదీల్లో ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియం వేదికగా ప్రేక్షకుల్లేకుండా మూడు వన్డేలు జరుగనున్నాయి. పొట్టి సిరీస్ను ఉత్కంఠ మధ్య చేజిక్కించుకున్న భారత్.. వన్డేల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలని ప్రణాళికలు రచిస్తున్నది. చివరి రెండు టీ20ల్లో తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినా.. అన్ని విభాగాల్లో సత్తాచాటి గెలువడంతో కోహ్లీ సేన ఆత్మవిశ్వాసంతో ఉంది. తొలిసారి వన్డే జట్టులోకి వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ, కృనాల్ పాండ్యా, సూర్యకుమార్తో పాటు హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి.
రాహుల్ గాయం..భారత్కు లాభం
పొట్టి క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు ఎక్కువ ఓవర్లు బ్యాటింగ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. విరాట్ కోహ్లీ ఇలాగే ఓపెనింగ్ చేయాలి. రాహుల్ ఫామ్లో లేకపోవడం ఒక విధంగా భారత్కు కలిసొచ్చింది. ఎందుకంటే ఈ కొత్త జోడీ భవిష్యత్పై ఆశలు పెట్టుకునేలా చేసింది. సచిన్ కూడా మొదట్లో మిడిలార్డర్లో ఆడేవాడు. ఒక్కసారి ఓపెనర్ అవతారమెత్తాక టీమ్ఇండియా రూపురేఖలే మారిపోయాయి.
-సునీల్ గవాస్కర్
ఆర్చర్ దూరం
టీమ్ఇండియాతో మూడు వన్డేల సిరీస్కు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ దూరమయ్యాడు. సిరీస్ కోసం 14 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మంగళవారం ప్రకటించగా.. మోచేతి గాయానికి గురైన ఆర్చర్ను పక్కన పెట్టింది. దీంతో జోఫ్రా ఇంగ్లండ్కు పయనం కానున్నాడు. కాగా ఐపీఎల్లో ప్రారంభ మ్యాచ్లకు సైతం అతడు అందుబాటులో ఉండడని ఈసీబీ ప్రకటించింది.
భారత్కు జరిమానా
ఇంగ్లండ్తో చివరి టీ20లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత ఆటగాళ్లపై జరిమానా పడింది. శనివారం జరిగిన పోరులో నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువ వేసినందుకు భారత ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో నుంచి 40 శాతం కోత విధిస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ పేర్కొన్నాడు.
అది తొందరపాటే..
అహ్మదాబాద్: సారథి విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనర్గా ఆడటాన్ని ఆస్వాదించానని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అయితే భవిష్యత్లో ఇలా కొనసాగడం విరాట్ ఆలోచనపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. ‘భవిష్యత్లో కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేయడం అనేది విరాట్ ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కోహ్లీ నాతో కలిసి ఆడాలని అనుకుంటే అదే జరగనివ్వండి. పొట్టి ప్రపంచకప్నకు చాలా సమయం ఉంది. అప్పుడు మా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పుడే చర్చించడం తొందరపాటే. ఈ మ్యాచ్లో టాపార్డర్లో ఒక బ్యాట్స్మన్ను తగ్గించి ఇంకో బౌలర్ను తీసుకోవాలని నిర్ణయించాం’ అని రోహిత్ అన్నాడు.