హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుతో ఆస్ట్రేలియా హై కమిషనర్ బారి ఓ ఫర్రెల్, కాన్సూల్ జనరల్ సారాకిర్లూ, ఎకనమిక్ కౌన్సిలర్ పెర్సీబెల్ బుధవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొవిడ్ పరిస్థితులను వారు అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ కొవిడ్ మహమ్మారి నుండి వేగంగా కోలుకుందని, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు. పర్యాటక, ఆతిధ్యరంగాలు పుంజుకుంటున్నాయన్నారు.
రాష్ట్రంలో పెట్టుబుడలు పెట్టే అంశంపైన వారు అడిగి తెలుసుకున్నారు. సోలార్ పవర్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులకు అనువుగా ఉంటుందని మంత్రి చెప్పారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని మెడికల్ డివైస్ పార్కు గూర్చి వారికి మంత్రి హరీశ్ రావు వివరించారు. దేశంలో తెలంగాణలోనే తొలి మెడికల్ డివైస్ పార్కు ఇదని, ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు సంప్రదిస్తున్నట్లు చెప్పారు.
దీంతో పాటు రాష్ట్రంలో విద్యుత్, వ్యవసాయం, సాగు నీరు అంశాలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో 24 గంటలు విద్యుత్ వ్యవసాయం, పరిశ్రమలు, గృహ అవసరాలకు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. ఎడాదికి కోటి ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని దీని ద్వారా ఏడాదికి 300 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో కొత్తగా ఆస్ట్రేలియా ఎంబసీ కార్యాలయాలు పెట్టే అవకాశం ఉంటే హైదరాబాద్లో పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు, విద్యార్థులకు అనువుగా ఉంటుందని మంత్రి సూచించారు. దీనిపై ఆస్ట్రేలియా హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు.