మకాయ్: కంగారూల చేతిలో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు ఆఖరి పోరులో ఓదార్పు విజయం సాధించింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో మిథాలీ బృందం 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. ఈ ఫార్మాట్లో 26 మ్యాచ్ల తర్వాత ఆసీస్కు ఇదే తొలి పరాజయం కావడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. ఆష్లే గార్డ్నర్ (67), బెత్ మూనీ (52) అర్ధశతకాలు సాధించగా.. తహిలా మెక్గ్రాత్ (47), అలీసా హీలి (35) రాణించారు. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జులన్ గోస్వామి, పూజా వస్ర్తాకర్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో బ్యాటర్లు సమిష్టిగా సత్తాచాటడంతో భారత్ 49.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. యషిక భాటియా (64), షఫాలీ వర్మ (56) హాఫ్సెంచరీలతో ఆకట్టుకోగా.. దీప్తి శర్మ (31), స్నేహ్ రాణా (30) విలువైన పరుగులు చేశారు. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు (డే అండ్ నైట్) గురువారం ప్రారంభం కానుంది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 264/9 (గార్డ్నర్ 67, మూనీ 52; జులన్ 3/37, పూజ 3/46), భారత్: 266/8 (యషిక 64, షఫాలీ 56; అనాబెల్ 3/30).