విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కూడిన భారత బృందం క్వారంటైన్లో ఉండనుంది. వీరంతా మే 18న ముంబైలో సమావేశమయ్యే అవకాశం ఉంది. జూన్ 2న సౌతాంప్టన్కు బయలుదేరే ముందు 14 రోజుల కఠిన క్వారంటైన్లో ఉంటారు. ముంబైలో ఐసోలేషన్లో ఉన్నప్పుడు మొత్తం బృందం(కుటుంబ సభ్యులతో సహా)లోని అందరికీ రెండు సార్లు నిర్వహించిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ రావాల్సి ఉంది. పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే టూర్కు అనుమతించనున్నారు.
పర్యటనకు వెళ్లే వారందరి ఇళ్లకు మెడికల్ టీమ్ను పంపించి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దీని కోసం బీసీసీఐ ఇప్పటికే జంబో జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.