దోహా: ఫిఫా ప్రపంచకప్ అర్హత టోర్నీలో భారత ఫుట్బాల్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. గురువారం జరిగిన గ్రూపు-ఈ లీగ్ మ్యాచ్లో భారత్ 0-1 తేడాతో ఖతార్ చేతిలో ఓటమిపాలైంది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మ్యాచ్లో ఖతార్ తరఫున అబ్దుల్ అజీజ్(33ని) ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్ 18వ నిమిషంలో రాహుల్ బెకె రెండోసారి యెల్లో కార్డ్కు గురికావడంతో టీమ్ఇండియా 10 మందితోనే మ్యాచ్ను నెట్టుకు రావాల్సి వచ్చింది. గ్రూపులో ఇప్పటివరకు ఓటమి ఎరుగని ఖతార్ 66 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకుని భారత గోల్పోస్ట్పై మెరుపులు దాడి చేసింది. మ్యాచ్లో 29సార్లు ఖతార్ గోల్స్ లక్ష్యంగా గురిపెడితే టీమ్ఇండియా కనీసం ఒక్కసారి ప్రత్యర్థిపై గోల్ చేయలేకపోయింది.