ముంబై: ఇంగ్లండ్ టూర్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన కోహ్లి.. అందరూ జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించాడు. వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇండియన్ టీమ్ త్వరలోనే ఇంగ్లండ్ వెళ్లనుంది. ఆలోపే ఆ టీమ్లోని ప్లేయర్స్ అందరూ తమ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని భావిస్తున్నారు.
అటు సీనియర్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా తన భార్య ప్రతిమా సింగ్తో కలిసి వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఇప్పటికే శిఖర్ ధావన్, రహానే, ఉమేష్ యాదవ్లాంటి వాళ్లు కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఐపీఎల్ వాయిదా పడగానే ఇంటికెళ్లిపోయిన కోహ్లి.. ఆ వెంటనే కొవిడ్ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు తనవంతుగా రూ.2 కోట్లు విరాళమిచ్చాడు. భార్య అనుష్క శర్మతో కలిసి మరిన్ని విరాళాలు సేకరిస్తున్నాడు.