ఐరాస, మే 28: భారత్లో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా రెండో దశ విపత్తు.. కొవాక్స్ కూటమికి వ్యాక్సిన్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిందని డబ్ల్యూహెచ్వో, గావి, యూనిసెఫ్, సీఈపీఐ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. జూన్ చివరినాటికి దాదాపు 19 కోట్ల డోసులకు కొరత ఏర్పడవచ్చని తెలిపాయి. కొవాక్స్ కూటమి ద్వారా ఈ ఏడాది చివరినాటికి పేద, వర్ధమాన దేశాలకు 200 కోట్ల డోసులు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కానీ, గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ 126 దేశాలకు 7 కోట్ల డోసులను మాత్రమే సరఫరా చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కొవాక్స్ కూటమికి కీలక వ్యాక్సిన్స్ సరఫరాదారుగా ఉన్నది. సీరం సంస్థ అస్ట్రాజెనెకా టీకాలను కొవాక్స్కు అందిస్తున్నది. అయితే భారత్లో కేసుల ఉద్ధృతి దృష్ట్యా దేశీయ అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో కొవాక్స్కు సరఫరాపై ప్రభావం పడింది. ప్రపంచదేశాలు కొవాక్స్కు టీకాలను విరాళంగా ఇవ్వాలని డబ్ల్యూహెచ్వో విజ్ఞప్తిచేసింది. అమెరికా, యూరప్ కలసి 18కోట్ల డోసులు అందించనున్నట్టు వెల్లడించింది. అయితే ఇంకా చాలా డోసుల అవసరం ఉన్నదని పేర్కొంది.