అల్మాటి: ఆసియా చాంపియన్షిప్ టైటిల్ను భారత స్టార్ రెజ్లర్ రవి కుమార్ నిలబెట్టుకోగా.. గాయం కారణంగా ఫైనల్ నుంచి తప్పుకున్న బజరంగ్ పునియా రజతంతో సరి పెట్టుకున్నాడు. శనివారం ఇక్కడ జరిగిన పురుషుల 57కేజీల విభాగం ఫైనల్లో రవి 9-4 తేడాతో అలీరెజా సర్లాక్ (ఇరాన్)ను చిత్తుచేసి, ఆసియా టోర్నీలో వరుసగా రెండోసారి స్వర్ణం దక్కించుకున్న మూడో భారత రెజ్లర్గా నిలిచాడు. ఇక మోచేతి గాయంతో తుది పోరు నుంచి తప్పుకున్న బజరంగ్ (65 కేజీలు)కు రజత పతకం దక్కింది. కాగా నర్సింగ్ యాదవ్ (79 కేజీలు), కరణ్ (70 కేజీలు), సత్యవర్త్ కదియాన్ (97 కేజీలు) కాంస్యాలు దక్కించుకోవడంతో.. శనివారం బరిలోకి దిగిన ఐదుగురు భారత రెజ్లర్లు పతకాలు పట్టారు.