యాదాద్రి, మార్చి 22: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేష ఘట్టం కల్యాణోత్సవం సోమవారం
ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు. దేవదేవుడితో మహాలక్ష్మి అమ్మవారి కల్యాణాన్ని భక్తజనులు కనులారా వీక్షించి తరించారు. ఉదయం 11.06 గంటలకు బాలాలయంలో తిరుకల్యాణం, రాత్రి 7.30 గంటలకు కొండకింద ఉన్న పాత ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోవేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమవైభవోత్సవ కల్యాణం నిర్వహించారు.
నేత్రపర్వంగా..
యాదాద్రి బాలాలయ మండపంలో ఉదయం 11.06 గంటలకు తిరుకల్యాణం ప్రారంభమైంది. పట్టువస్ర్తాలు, స్వర్ణ, వజ్రవైఢూర్య, ముత్యాల ఆభరణాలతో నవ వరుడిగా అలంకృతుడైన లోక కల్యాణకారకుడు నారసింహుడు గజవాహనంపై మండపానికి ఊరేగింపుగా రాగా, భక్తజన కోటికి సకల సంపదలను ప్రసాదించే మహాలక్ష్మి అమ్మవారిని పుష్పాలపల్లకిలో కల్యాణ వేదికకు తీసుకువచ్చారు. లక్ష్మీనరసింహుల కల్యాణ వేడుకలకు పాంచారాత్రాగమశాస్త్రం ప్రకారం దేవతల సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడికి తొలిపూజలతో శ్రీకారం చుట్టారు. స్వామి, అమ్మవార్లకు రక్షాసూత్రధారణ చేసిన అర్చకులు వేద ప్రాశస్త్యమైన మంత్రోచ్ఛరణలతో స్వామివారికి యజ్ఞోపవీతధారణ తంతు నిర్వహించారు. అనంతరం లక్ష్మీదేవి తండ్రి సముద్రుడు నృసింహుడికి పాదప్రక్షాళన చేయగా, అర్చకులు వేదమంత్ర పఠనాలతో జీలకర్ర, బెల్లం తంతు నిర్వహించారు. మధ్యాహ్నం 1.12 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తంలో భక్తజనుల గోవింద నామస్మరణ, వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి మెడలో స్వామివారు మాంగల్యధారణ చేశారు. కల్యాణ మహోత్సవాన్ని యజ్ఞికులు శేషం ప్రణీతాచార్యులు, ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహచార్యులు, మోహనాచార్యులు నిర్వహించారు.