దామరచర్ల, మే 18 : మండలంలోని వీర్లపాలెం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంటును పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పవర్ ప్లాంటు పనులను టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్రావుతో కలిసి మంగళవారం పరిశీలించారు. ప్లాంటులో నిర్మాణం చేపడుతున్న బ్రాయిలర్స్, చిమ్నీలు, రిజర్వాయర్, యాష్ ప్లాంటు, విద్యుత్ సబ్స్టేషన్ల పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల ప్రగతి గురించి జెన్కో, బీహెచ్ఈఎల్, ట్రాన్స్కో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద థర్మల్ ప్లాంట్ నల్లగొండ జిల్లాలో నిర్మించడం గర్వకారణమన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాలుష్య రహితంగా నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాదాద్రి పవర్ ప్లాంట్ను గడువులోపు పూర్తిచేసి 2023లో మొదటి దశ విద్యుత్ ఉత్పత్తి చేసేలా పని చేయాలన్నారు.
పనుల్లో జాప్యం జరుగకుండా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికుల ఆరోగ్యంపై పూర్తి భరోసా కల్పించాలన్నారు. వారి కోసం ప్లాంటు పరిధిలో 20 పడకల దవాఖానను పది రోజుల్లో నిర్మించి వైద్య సిబ్బందిని నియమించాలని బీహెచ్ఈఎల్ అధికారులను ఆదేశించారు. కరోనా బారిన పడినవారికి క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి మెరుగైన చికిత్స అందించాలన్నారు. పవర్ ప్లాంటుకు అవసరమయ్యే రైల్వే, నీటి పైపులైన్ల ఏర్పాటుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. లైన్ల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ సత్వరమే జరుపాలని మిర్యాలగూడ ఆర్డీఓ హరిసింగ్ను మంత్రి ఆదేశించారు. కాలుష్య రహిత వాతావరణం కోసం రూ.ఆరు వేల కోట్లతో అన్నవేరు వాగు వెంట, ప్లాంటు శివారులో గ్రీన్బెల్ట్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్లు అజయ్, సచ్చితానందం, టీఆర్కే రావు, సీఈ సమ్మయ్య, ఎస్ఈ రామకృష్ణారెడ్డి, ఈఈ బుచ్చయ్య, బీహెచ్ఈఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ సిసోడియా, కోల్ సీఎండీ జేఎస్ రావు, ఎస్ఈ హనుమంతు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డి.నారాయణరెడ్డి, మిర్యాలగూడ ఆర్డీఓ హరిసింగ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.