టోక్యో: టోక్యో పారాలింపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్లో రజత పతకం సాధించింది. చైనా ప్లేయర్, వరల్డ్ నంబర్ వన్ సీడ్ యింగ్ జావోతో జరిగిన ఫైనల్ పోరులో 3-0తో ఓటమిపాలయింది. 34 ఏండ్ల భవీనాపై 7-11, 5-11, 6-11 స్కోర్తో జయకేతనం ఎగురవేసిన జావో.. బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో భవీనా సిల్వర్ మెడల్తో దేశానికి రానుంది. అయితే పారాలింపిక్స్ చరిత్రలో టేబుల్ టెన్నిస్లో భారత్కి పతకం దక్కడం ఇదే మొదటిసారి.
గుజరాత్కి చెందిన భవీనాబెన్ పటేల్ పోలియో కారణంగా చక్రాల కుర్చీకి పరిమితమైంది. మొదట్లో ఫిట్నెస్ కోసం సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడటం ప్రారంభించిన భవీనా.. ఆ తర్వాత దానినే కెరీర్గా ఎంచుకుని కష్టపడింది. మొదట్లో వెనుకబడినా మధ్యలో పుంజుకోవడాన్ని బాగా అలవాటు చేసుకున్నది. మొత్తంగా పారాలింపిక్స్లో పతకం గెలిచిన భారత రెండో అథ్లెట్గా అరుదైన ఘనత సాధించింది. 2016లో దీపా మాలిక్ రజత పతకం గెలుపొందిన విషయం తెలిసిందే.