దుబాయ్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ‘డ్రా’ లేదా ‘టై’ అయితే ఇరు జట్లను విజేతగా ప్రకటించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ‘టై’ కావడంతో ఆ తర్వాత సూపర్ ఓవర్ నిర్వహించి అందులో కూడా ఫలితం తేలకపోవడంతో.. ఎక్కువ బౌండ్రీలు కొట్టిన జట్టును విజేతగా ప్రకటించి అభాసుపాలైన ఐసీసీ.. టెస్టు చాంపియన్షిప్ విషయంలో అలాంటి తప్పు జరుగకూడదని ముందస్తు చర్యలకు పూనుకుంది. వచ్చే నెల 18 నుంచి సౌతాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడనుండగా.. ఈ మ్యాచ్లో ఫలితం తేలకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటించాలని ఐసీసీ నిర్ణయించింది. అనివార్య కారణాల వల్ల నిర్ణీత ఐదు రోజుల్లో 450 ఓవర్ల (రోజుకు 90 ఓవర్లు) ఆట సాధ్యం కాకపోతే.. ఆరో రోజును రిజర్వ్ డేగా ప్రకటించిన ఐసీసీ.. అప్పటిలోపు ఫలితం తేలకుంటే ఇరు జట్లను విజేతలుగా ప్రకటించనుంది. ‘ఐదు రోజుల ఆటలో ఫలితం తేలకపోతే మ్యాచ్ను ‘డ్రా’గా ప్రకటిస్తాం’ అని ఐసీసీ శుక్రవారం తెలిపింది.
డ్యూక్ బంతులతో..
టీమ్ఇండియా స్వదేశంలో ఎస్జీ బంతులతో మ్యాచ్లు ఆడుతుండగా.. న్యూజిలాండ్ ఆటగాళ్లు కూకబుర్రా బంతులు వినియోగిస్తున్నారు. అయితే తటస్థ వేదికలో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ను డ్యూక్ బంతులతో నిర్వహించనున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది.