మంచిర్యాల ఏసీసీ, జూన్ 16 : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నది. బుధవారం 1448 మందికి వ్యాక్సిన్ వేసుకున్నారని వ్యాక్సినేషన్ అధికారి ఫయాజ్ఖాన్ తెలిపారు. జిల్లాలోని డ్వాక్రా స్వయం సహాయక గ్రూపుల్లోని 35 వేల మంది సభ్యులకు వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. 691 మంది సభ్యులకు ఆయా మండలాల్లో బుధవారం టీకా ఇచ్చారు. ప్రభుత్వ శాఖల్లోని 513 మందికి, ప్రజాప్రతినిధులు 244 మందికి వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొదటిడోస్ 1,09,584 , రెండో డోస్ 16,168 మందితో కలిపి మొత్తంగా 1,25,752 మందికి టీకా వేసినట్లు వెల్లడించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా గనుల వద్దే టీకా
కాసిపేట, జూన్ 16 : దేశంలో ఎక్కడా లేని విధంగా గనుల వద్దే కార్మికులకు టీకా వేస్తున్నామని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం మందమర్రి ఏరియాలోని కాసిపేట గనిపై కార్మికుల కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జీఎం శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎండీ శ్రీధర్ కృషితో కార్మికులకు ఇబ్బంది లేకుండా గనుల వద్దే కార్మికులకు టీకా వేస్తున్నామని తెలిపారు. ప్రతి కార్మికుడూ టీకా వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏజెంట్ కుర్మ రాజేందర్, ఏరియా దవాఖాన డీవై సీఎంవో ఉష, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, సెంట్రల్ ఉపాధ్యక్షుడు బడికెల సంపత్, టీబీజీకేఎస్ పిట్ సెక్రెటరీలు దుగుట శ్రీనివాస్, కారుకూరి తిరుపతి, గని మేనేజర్ ఉల్లా ఉద్దీన్, వెల్ఫేర్ ఆఫీసర్ జీషా, ఏరియా సహాయ కార్యదర్శి వొడ్నాల రాజన్న, ఏఐటీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు దాగం మల్లేశ్, డాక్టర్ లోక్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ను వేసుకోవాలి
మంచిర్యాలటౌన్, జూన్ 16: కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య కోరారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాలలో ఇంటింటికీ తిరుగుతూ టీకాను వేయించుకోవాలని పట్టణ వాసులకు సూచించారు. ఐకేపీ పీఆర్పీ చంద్రయ్య, సీవోలు, ఆర్పీలు పాల్గొన్నారు.
టీకా తీసుకున్న ప్రజా ప్రతినిధులు
తాండూర్, జూన్ 16 : తాండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం మండలంలోని ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు కొవిడ్ టీకా వేసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాండూర్ పీహెచ్సీలో కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ప్రారంభించినట్లు వైద్యుడు కుమారస్వామి తెలిపారు. ఈ సందర్భంగా 10 మంది ప్రజాప్రతినిధులకు వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని వైద్యుడు తెలిపారు.
నెన్నెల మండలంలో..
నెన్నెల, జూన్ 16 : మండలంలోని సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులకు నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ టీకాలు వేశారు. కరోనా నియంత్రణ భాగంగా ప్రజా ప్రతినిధులకు టీకాలను వేస్తున్నట్లు వైద్యాధికారి అనిష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, వైస్ చైర్మన్ సుమలత, ఎంపీటీసీ కమల, సర్పంచ్లు పాల్గొన్నారు.
శ్రీరాంపూర్లో..
శ్రీరాంపూర్, జూన్ 16 : శ్రీరాంపూర్ ఏరియాలో బుధవారం 733 మంది కార్మికులకు వ్యాక్సిన్ వేశామని డీవైసీఎంవో డాక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు.