టోక్యో: భారీ అంచనాలతో విశ్వక్రీడలకు బయలుదేరిన భారత బృందం.. టోక్యో క్రీడా గ్రామంలో ప్రాక్టీస్ ప్రారంభించింది. ఆదివారం కొవిడ్ పరీక్షల తర్వాత తమకు కేటాయించిన గదులకు పరిమితమైన మనవాళ్లు.. సోమవారం మైదానాల్లో చెమటోడ్చారు. స్టార్ ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్ బాణాలు ఎక్కుపెట్టగా.. టీటీ ప్లేయర్లు శరత్ కమల్, సాతియాన్ ప్యాడ్లకు పనిచెప్పారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధుతో పాటు పురుషుల సింగిల్స్లో బరిలోకి దిగుతున్న సాయి ప్రణీత్ కఠోర సాధన కొనసాగించగా.. జిమ్నాస్టిక్స్లో బరిలోకి దిగుతున్న ప్రణతి నాయక్ కోచ్ లక్ష్మణ్ మనోహర్ ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేసింది. అందరికంటే ముందు టోక్యోలో అడుగుపెట్టిన భారత సెయిలింగ్ జట్టు గత రెండు రోజులుగా సాధన కొనసాగిస్తుండగా.. భారత రోయర్స్ అర్జున్ -అర్వింద్ జాతీయ కోచ్, హైదరాబాదీ ఇస్మాయిల్ బేగ్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేశారు. భారత షూటింగ్ బృందం కూడా గురికి పదునుపెట్టింది.