డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం కురవడంతో వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్న కాలువ దాటబోయి ఓ బైకర్ బైక్తో సహా కొట్టుకుపోయాడు. చమోలీ జిల్లాలోని థరాలీ, గ్వాలాడామ్ మధ్య సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కాలువలో వరద ఉధృతంగా ప్రవహిస్తున్నా ఓ వ్యక్తి ఆ కాలువను దాటేందుకు ప్రయత్నించాడని, కాలువ మధ్యలోకి వెళ్లిన తర్వాత బైక్ జారీపోవడంతో బైక్తో సహా కొట్టుకుపోయాడని పోలీసులు తెలిపారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న వెంటనే గల్లంతైన వ్యక్తి కోసం గాలించామని పోలీసులు చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దిగువన బైకు చెట్లకు చిక్కుకుని ఆగిపోయిందని, గల్లంతైన వ్యక్తి జాడ మాత్రం తెలియరాలేదని తెలిపారు. అయితే, గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. గల్లంతైన వ్యక్తికి సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉందన్నారు.