కందుకూరు, మార్చి 7 : బీజేపీ పాలనలో దేశం ఆగమవుతుందని, రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే పట్టభద్రులు ఓటు వేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు 70వేల కోట్లు కేటాయించిన బీజేపీ, తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడేమో ప్రశ్నించే గొంతుమవుతామంటూ అబద్ధాలతో ప్రచారానికి వస్తున్నారని.. ముందు వారు ఏం చేశారో వాళ్లను వారే ఓ సారి ప్రశ్నించుకోవాలని సూచించారు. సురభి వాణీదేవికి మద్దతుగా ఆదివారం మండల పరిధిలోని తిమ్మాపూరు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి విద్యావంతురాలైన సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంగాపురం గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. విద్యావిధానంపై పట్టున్న సురభి వాణీదేవిని గెలిపిస్తే ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తారని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావుకు ఆయన కూతరు వాణీదేవిని గెలిపించి నిజమైన నివాళులర్పించాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజల బతుకులు ఆగం చేస్తున్నదని మండిపడ్డారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ముందు ఇచ్చిన హమీలు ఒక్కటైనా నెరవేర్చారా.. నల్లధనం వెనక్కి తెచ్చారా.., పేదల ఖాతాల్లో వేస్తానన్న డబ్బులు వేశారా..? రాష్ర్టానికి ఒక్క మంచిపనైనా చేశారా.. అని ప్రచారానికి వస్తున్న బీజేపీ నేతలను ప్రశ్నించాలని పట్టభద్రులకు సూచించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్రానికి ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరియైన నిర్ణయం తీసుకుంటుందని, ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని చెప్పారు. అదే విధంగా ప్రైవేట్ విద్యా సంస్థల సమస్యలను పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని వరలక్ష్మీసురేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ వట్నాల శోభ, ఉప సర్పంచ్ శ్రీరాములు, సీనియర్ నాయకులు ఈశ్వర్గౌడ్, భిక్షపతి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, కౌశిక్రెడ్డి, వెంకటేశ్గౌడ్, పీఎసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, సోషల్ మీడియా కన్వీనర్ దీక్షిత్రెడ్డి, కార్తీక్, శ్రీలత యాదగిరి,సంతోశ్, నర్సింహ, ప్రశాంత్రెడ్డి, రాజు, అంజమ్మ, అశోక్, శేఖర్గౌడ్, అనిత తదితరులు పాల్గొన్నారు.
బన్సీలాల్పేట్, మార్చి 7 : విద్యావంతులు విజ్ఞతతో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పనిచేసే ప్రభుత్వానికే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం బన్సీలాల్పేట్ రెసిడెంట్స్ అసోసియేషన్, గాంధీనగర్కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పట్టభద్రులు, కాలనీవాసులతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణీదేవికి ఓటు వేయాలని కోరారు. వరుసగా సెలవులు వస్తున్నాయని, అందులో ఓటు వేయడాన్ని నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. రాష్ర్టాభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే వాణీదేవిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్, కార్పొరేటర్ కె.హేమలత, బన్సీలాల్పేట్ రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఏ.ఫహీమ్, సీమా, భాగ్యమ్మ, కమల్కుమార్, ప్రేమ్కుమార్, గాంధీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్, కార్యదర్శి రవికాంత్ పాల్గొన్నారు.