వారం రోజులు వరుసగా ఆఫీసుకు వెళ్తే చాలు.. సెలవు ఎప్పుడు దొరుకుతుందా.. ఎప్పుడు విశ్రాంతి తీసుకుందామా అని చూస్తుంటాం.. ఒంట్లో కొంచెం నలతగా ఉన్నా ఆ రోజు పని మానేసి రెస్ట్ తీసుకోవాలని అనుకుంటాం.. కానీ వందేళ్లకు చేరువలో ఉన్న ఈ తాతను చూస్తే మన ఆలోచనలను మార్చుకుంటామేమో!! ఎందుకు అంటారా.. ఉత్తర్ప్రదేశ్లోని రాయ్ బరేలీకి చెందిన 98 ఏళ్ల విజయ్ పాల్ సింగ్.. ఇప్పటికీ ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా సంపాదించుకుంటూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ప్రతి రోజు శనిగలు, గుడాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ వయసులో ఆ తాత అంతగా కష్టపడుతున్నాడు అంటే అతన్ని చూసుకునేవారు ఎవరు లేరని అనుకుంటే పొరపాటే. అతనికి పెద్ద కుటుంబమే ఉందట. వాళ్లు సంపాదిస్తే ఆయన కూర్చొని తినొచ్చు.. కానీ అలా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఈ తాతకు నచ్చదంట. పనిచేస్తేనే హుషారుగా అనిపిస్తుందంట. ఖాళీగా ఇంట్లోనే కూర్చుంటే అనారోగ్యంగా ఉన్నట్టుగా అనిపిస్తుందట. ఈ వయసులో ఇంటి దగ్గర కూర్చుని విశ్రాంతి తీసుకోకుండా ఇలా పనిచేయడం అవసరమా తాత అని ఒక కస్టమర్ అడిగితే కూడా ఇదే సమాధానమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ తాత వీడియో వైరల్ కావడంతో రాయ్ బరేలీ జిల్లా అధికారులు స్పందించారు. విజయ్ పాల్ సింగ్ను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లి సత్కరించారు. రూ.11వేల నగదు పురస్కారం అందించారు. అంతే కాకుండా ఒక చేతి కర్రను కూడా బహుమతిగా ఇచ్చారు.