న్యూఢిల్లీ: భారత మహిళా జట్టులోని మరో క్రికెటర్కు కరోనా వైరస్ అపార వేదన మిగిల్చింది. ప్రియా పునియా తల్లి ప్రమాదకర వైరస్తో పోరాడుతూ మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రియా తెలిపింది. అలాగే తల్లిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ పూరిత పోస్ట్ చేసింది. ఎప్పుడూ దృఢంగా ఉండాలని నువ్వు నాకెందుకు చెబుతావో ఈ రోజు అర్థమైంది. నీ నిష్క్రమణను నేను తట్టుకోవాల్సిన రోజు వస్తుందని నీకు తెలుసు. అమ్మా.. నిన్ను మిస్సవుతున్నా. నువ్వు వెళ్లే దూరం ఎంతైనా.. నిత్యం నాతోనే ఉంటావని తెలుసు అని పునియా రాసింది. కాగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన ప్రియ.. టీమ్ఇండియాతో కలిసి జూన్ తొలివారంలో బయలుదేరాల్సి ఉంది. బ్రిటన్ టూర్ కోసం బుధవారమే భారత మహిళల జట్టు ముంబై చేరుకొని క్వారంటైన్లో ఉండనుంది. కాగా భారత క్రికెటర్ వేద కృష్ణమూర్తి తల్లి, సోదరి కూడా కరోనాతో పోరాడుతూనే మృతి చెందిన సంగతి విదితమే.