టోక్యో: ఒలింపిక్స్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు భారత మహిళల హాకీ జట్టు ఉవ్విళ్లూరుతున్నది. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో సెమీస్కు అర్హత సాధించిన రాణిరాంపాల్ సారథ్యంలోని టీమ్ఇండియా.. బుధవారం పటిష్ట అర్జెంటీనాతో పోరుకు సిద్ధమైంది. విజయమో, వీరస్వర్గమో అన్న రీతిలో చెలరేగి కోట్లాది మంది అభిమానుల కలను సాకారం చేసేందుకు మన మహిళల జట్టు పట్టుదలతో కనిపిస్తున్నది. క్వార్టర్స్లో మూడుసార్లు ఒలింపిక్ విజేత ఆస్ట్రేలియాను మట్టికరిపించి జోష్లో ఉన్న భారత్.. అర్జెంటీనా భరతం పట్టాలని చూస్తున్నది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ఫైనల్లోకి ప్రవేశించేందుకు అమ్మాయిలు తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశముంది.