న్యూఢిల్లీ: భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టును వీక్షించేందుకు భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు లండన్ బయల్దేరనున్నాడు. దాదాతో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్ కూడా లార్డ్స్ మ్యాచ్కు వెళ్లనున్నట్లు సోమవారం బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి క్వారంటైన్ నిబంధనల్లో ఇంగ్లండ్ ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో వీరంతా రెండో టెస్టుకు హాజరు కానున్నారు. కాగా.. రెండో టెస్టు కోసం విరాట్ సేన ఇప్పటికే లార్డ్స్కు చేరుకోగా.. శ్రీలంక నుంచి నేరుగా ఇంగ్లండ్కు వెళ్లిన పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ ఈ నెల 13 వరకు నాటింగ్హామ్లోనే క్వారంటైన్లో ఉండనున్నారు.