హైదరాబాద్ : రాష్ట్రంలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసి నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నది. ఇవాళ్టి వరకు మొత్తం 851 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకొని, 87 మంది కేసులు నమోదు చేశారు. 27 మంది వ్యాపారులపై పీడీ చట్టం నమోదు చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసుల శాఖ ఇప్పటికే ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఈ టాస్క్ఫోర్స్ బృందాలు వ్యవసాయ అధికారులతో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో నకిలీ విత్తనాలను అరికట్టి రైతులు నష్టపోకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఈ మేరకు పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వ్యాపారులకు నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.