టాపార్డర్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఎలా ఉంటుందో టీమ్ఇండియా లీడ్స్లో చూపెట్టింది. హిట్మ్యాన్ రోహిత్ శర్మ చక్కటి ఇన్నింగ్స్తో మెరుగైన పునాది వేస్తే.. నయావాల్ చతేశ్వర్ పుజారా తన స్వభావానికి భిన్నంగా ఆడి ప్రత్యర్థితో పాటు సొంత ఆటగాళ్లను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. పాతకాపు జెమ్స్ అండర్సన్ను ఎదుర్కొనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న భారత సారథి విరాట్ కోహ్లీ.. క్లాసిక్ ఇన్నింగ్స్తో కదం తొక్కడంతో.. టీమ్ఇండియా మూడో రోజు మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి రెండు రోజులు పూర్తిగా తేలిపోయిన టీమ్ఇండియా.. మూడో రోజు చక్కటి ఆటతీరు కనబర్చడం సానుకూలాంశం కాగా.. నాలుగో రోజు ఇదే జోరు కొనసాగించడంపైనే ఈ మ్యాచ్ భవితవ్యం ఆధారపడి ఉంది!
లీడ్స్: తొలి ఇన్నింగ్స్లో పేలవ ఆటతీరు కనబర్చిన భారత బ్యాట్స్మెన్.. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బౌలర్లను మెరుగ్గా ఎదుర్కొన్నారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. నయావాల్ చతేశ్వర్ పుజారా (180 బంతుల్లో 91 బ్యాటింగ్; 15 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. హిట్మ్యాన్ రోహిత్ శర్మ (156 బంతుల్లో 59; 7 ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ విరాట్ కోహ్లీ (94 బంతుల్లో 45 బ్యాటింగ్; 6 ఫోర్లు) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్, ఓవర్టన్ చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న భారత్.. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరుకు 139 పరుగులు వెనుకబడి ఉంది. పుజారాతో పాటు కెప్టెన్ కోహ్లీ క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 423/8తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 9 పరుగులు జోడించి ఆలౌటైంది. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ నాలుగు, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్లో శనివారం భారత టాపార్డర్.. ఇంగ్లిష్ బౌలర్లను కాచుకోవడంపైనే టీమ్ఇండియా భవితవ్యం ఆధారపడి ఉంది.
20 బంతుల్లోనే..
వర్షం కారణంగా శుక్రవారం ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభం కాగా.. 20 బంతుల్లోనే ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి.. ఓవరాల్గా 354 పరుగుల ఆధిక్యాన్ని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్లో ఘోరంగా విఫలమై.. తీవ్ర ఒత్తిడిలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమ్ఇండియా.. ఆరంభంలో ఆచితూచి ఆడింది. రోహిత్ అడపా దడపా షాట్లు ఆడుతున్నా.. లోకేశ్ రాహుల్ (54 బంతుల్లో 8) మాత్రం పూర్తిగా డిఫెన్స్కే పరిమితమయ్యాడు. మరో బంతి అయితే తొలి సెషన్ ముగుస్తుందనగా.. స్లిప్లో బెయిర్స్టో పట్టిన అద్భుత క్యాచ్కు రాహుల్ ఔటయ్యాడు.
పుజారా దూకుడు
లంచ్ తర్వాత రోహిత్కు పుజారా జత కలవడంతో భారత ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన రోహిత్ ఇంగ్లిష్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటుంటే.. పుజారా తన స్వభావానికి విరుద్ధంగా ఆరంభం నుంచే దూకుడుగా ఆడి.. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రోహిత్ 125 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీ సాధికారికతతో ముందుకు సాగడంతో ఇంగ్లండ్ జట్టు ఆత్మరక్షణలో పడింది. రూట్ ఎంతమంది బౌలర్లను మార్చిన ఫలితం లేకపోవడంతో చివరకు తనే బంతినందుకున్నాడు. అయినా ఏమాత్రం ఇబ్బంది పడని టీమ్ఇండియా రెండో సెషన్లో పూర్తి ఆధిపత్యం కనబర్చింది. టీ విరామం అనంతరం రెండో ఓవర్లోనే రోహిత్ ఔటవడం భారత్ను దెబ్బకొట్టింది. అప్పటి వరకు పూర్తి ఏకగ్రతతో ఆడిన రోహిత్.. రాబిన్సన్ వేసిన స్ట్రెయిట్ బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు.
కెప్టెన్ అండతో..
సిరీస్లో ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈసారి మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. తనను పదే పదే ఔట్ చేస్తున్న అండర్సన్నే లక్ష్యంగా చేసుకొని రెండు బౌండ్రీలు కొట్టి టచ్లోకి వచ్చాడు. మరో ఎండ్లో పూజారా అర్ధశతకం పూర్తి చేసుకోవడంతో తిరిగి ఇన్నింగ్స్ గాడిన పడింది. సాధారణంగా క్రీజులోనే ఉండి బ్యాక్ఫుట్పై ఆడే పుజారా.. పదే పదే క్రీజు వదిలి ముందుకు వస్తూ ప్రత్యర్థి బౌలర్లను తికమక పెట్టాడు. అండర్సన్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన పుజారా.. ఓవర్టన్ను ఓ ఆటాడుకున్నాడు. కచ్చితత్వంతో కూడిన కవర్ డ్రైవ్లు, కళాత్మక స్ట్రెయిట్ డ్రైవ్లతో పాటు.. తన శైలికి భిన్నమైన హుక్ షాట్లతో పుజారా తన విలువ చాటుకుంటే.. కోహ్లీ చాప కింద నీరులా ముందుకు సాగాడు. మూడో వికెట్కు ఈ జంట అజేయంగా 99 పరుగులు జోడించాక.. వెలుతురు లేమి కారణంగా మ్యాచ్ను నిర్ణీత సమయం కంటే ముందే ముగించారు.
వీళ్లపైనే భారం
2001 కోల్కతా టెస్టు తరహాలో అద్భుత పోరాట పటిమ ప్రదర్శించిన భారత్.. శనివారం కూడా ఇదే జోరు కొనసాగిస్తే.. ఈ మ్యాచ్లో టీమ్ఇండియాకు మెరుగైన అవకాశాలు ఉంటాయి. శుక్రవారం 80 ఓవర్ల పాటు క్రీజులో నిలిచి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 215 పరుగులు చేసిన కోహ్లీ సేన నాలుగో రోజూ ఇదే ఆటతీరు కనబరిస్తే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును దాటేయడంతో పాటు.. ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని నిలపవచ్చు. ప్రస్తుతానికి ఓపెనర్లు పెవిలియన్ చేరిపోగా..విరాట్, పుజారా తర్వాత అజింక్యా రహానే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా బ్యాటింగ్కు రానున్నారు. పుజారా వీలైనంత ఎక్కువసేపు క్రీజులో నిలిస్తేనే భారత్ ఈ మ్యాచ్ను కాపాడుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. కోహ్లీ, పుజ్జీ, రహానే రెండు సెషన్ల పాటు ఇంగ్లిష్ బౌలర్లను అడ్డుకోగలిగితే.. రిషబ్ పంత్, జడేజా ప్రత్యర్థికి మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించే చాన్స్ ఉంది!
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 78 ఆలౌట్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (బి) షమీ 61, హమీద్ (బి) జడేజా 68, మలన్ (సి) పంత్ (బి) సిరాజ్ 70, రూట్ (బి) బుమ్రా 121, బెయిర్స్టో (సి) కోహ్లీ (బి) షమీ 29, బట్లర్ (సి) ఇషాంత్ (బి) షమీ 7, అలీ (సి) (సబ్) అక్షర్ (బి) జడేజా 8, కరన్ (సి) (సబ్) మయాంక్ (బి) సిరాజ్ 15, ఓవర్టన్ (ఎల్బీ) షమీ 32, రాబిన్సన్ (బి) బుమ్రా 0, అండర్సన్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 21, మొత్తం: 432. వికెట్ల పతనం: 1-135, 2-159, 3-298, 4-350, 5-360, 6-383, 7-383, 8-418, 9-431, 10-432, బౌలింగ్: ఇషాంత్ 22-0-92-0, బుమ్రా 27.2-10-59-2, షమీ 28-8-95-4, సిరాజ్ 23-3-86-2, జడేజా 32-8-88-2.
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) రాబిన్సన్ 59, రాహుల్ (సి) బెయిర్స్టో (బి) ఓవర్టన్ 8, పుజారా (నాటౌట్) 91, కోహ్లీ (నాటౌట్) 45, ఎక్స్ట్రాలు: 12, మొత్తం: 215/2. వికెట్ల పతనం: 1-34, 2-116, బౌలింగ్: అండర్సన్ 19-8-51-0, రాబిన్సన్ 18-4-40-1, ఓవర్టన్ 17-6-35-1, కరన్ 9-1-40-0, అలీ 11-1-28-0, రూట్ 6-1-15-0.