విజయానికి ఎనిమిది వికెట్ల దూరంలో ఆసీస్

సిడ్నీ: నాలుగు టెస్ట్ల సిరీస్లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. పింక్ టెస్ట్లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 338 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులుకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఓవర్సీస్లో ఓపెనర్గా తొలి మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ అర్ధ సెంచరీ చేశాడు. 52 పరుగులకు కమ్మిన్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఇక మరో ఓపెనర్ శుభ్మన్ గిల్( 31) పరుగుల దగ్గర కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
407 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్స్ ఇద్దరి వికెట్స్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఈ మ్యాచ్కు మరో రోజు మిగిలి ఉండగా, భారత్ విజయం సాధించాలంటే 309 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా విజయం కోసం ఎనిమిది వికెట్స్ కావలసి ఉంది. ప్రస్తుతం క్రీజులో పుజారా(9).రహానే(4) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్స్లో హాజిల్ వుడ్, కమ్మిన్స్కు చెరో వికెట్ దక్కింది.
ఆదివారం ఓవర్నైట్ వ్యక్తిగత స్కోరు 47తో ఈరోజు బ్యాటింగ్ని కొనసాగించిన మార్కస్ లబుషేన్ (73: 118 బంతుల్లో 9x4) హాఫ్ సెంచరీ నమోదు చేసి నవదీప్ సైనీ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత మాథ్యూవెడ్ (4: 11 బంతుల్లో 1x4)ని కూడా సైనీ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆస్ట్రేలియా 10 పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు చేజార్చుకుంది. స్మిత్(81), గ్రీన్(84),పైన్(39) రాణించడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్లోను భారీ స్కోరు చేసింది. టీ బ్రేక్కి ముందు గ్రీన్ ఔటవగా.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో అశ్విన్, సైనీ రెండేసి వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, బుమ్రాకి ఒక వికెట్ దక్కింది.