దోహా: ఫిఫా ప్రపంచకప్, ఆసియా కప్ అర్హత పోటీల్లో భాగంగా భారత ఫుట్బాల్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం ఆసియా చాంపియన్స్ ఖతార్తో టీమ్ఇండియా తలపడనుంది. ప్రపంచకప్ అర్హత రేసు నుంచి ఇప్పటికే దూరమైన సునీల్ ఛెత్రీ కెప్టెన్సీలోని భారత్..ఆసియా టోర్నీ(2023) బెర్తు దక్కించుకునేందుకు పట్టుదలతో కనిపిస్తున్నది. గ్రూపు-ఈలో ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఐదు విజయాలతో ఖతార్ ప్రస్తుతం టాప్లో కొనసాగుతుంటే.. భారత్ మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. దీనికి తోడు ఫిఫా ర్యాంకింగ్స్లో ఖతార్ 58వ ర్యాంక్లో ఉంటే టీమ్ఇండియా 105వ స్థానంలో ఉంది. ఆసియా జట్లలో అత్యుత్తమంగా కొనసాగుతున్న ఖతార్ను నిలువరించాలంటే భారత్ శక్తికి మించి పోరాడాల్సి ఉంది. కరోనా వైరస్ నుంచి కోలుకుని స్టార్ స్ట్రైకర్ సునీల్ ఛెత్రీ తిరిగి రావడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచనుంది. బలాబలాల పరంగా చూసుకుంటే తమకంటే మెరుగైన ఖతార్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తామని కెప్టెన్ ఛెత్రీ చెప్పాడు.