న్యూఢిల్లీ: చైనా కంపెనీ లీ నింగ్ను స్పాన్సర్షిప్ నుంచి ఇండియా తప్పించింది. టోక్యో ఒలింపిక్స్కు వెళ్తున్న మన క్రీడాకారులు ఇక ఎటువంటి బ్రాండెడ్ జెర్సీలను ధరించారు. భారతీయ ఒలింపిక్ సంఘానికి లీ నింగ్ కంపెనీ చాన్నాళ్ల నుంచి అఫీషియల్ కిట్ స్పాన్సర్గా ఉంది. కానీ గత ఏడాది లడాఖ్లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ తర్వాత డ్రాగన్ దేశంపై ఆంక్షలు పెరిగాయి. ఈ నేపథ్యంలో లీ నింగ్ కంపెనీతో ఉన్న సంబంధాలపై పునర్ ఆలోచించనున్నట్లు భారతీయ ఒలింపిక్ సంఘం పేర్కొన్నది. వాస్తవానికి టోక్యో ఒలింపిక్స్ క్రీడల తర్వాత లీ నింగ్ కంపెనీతో ఐఓఏ డీల్ ముగియాల్సి ఉన్నది. ఆరు రోజుల క్రితం లీనింగ్ కంపెనీ డిజైన్ చేసిన ఒలింపిక్ కిట్ను ఆవిష్కించారు. కానీ భారతీయ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆ కంపెనీతో ఉన్న బంధాన్ని బ్రేక్ చేస్తున్నట్లు ఐఏఓ చెప్పింది. అభిమానుల భావోద్వేగాలను గౌరవిస్తామని, ఈ నేపథ్యంలో లీ నింగ్ కంపెనీతో ఉన్న కాంట్రాక్టును ఉపసంహరిస్తున్నట్లు ఐఏఓ అధ్యక్షుడు నరేందర్ బత్రా తెలిపారు. టోక్యో ఒలింపిక్స్కు వెళ్లే భారతీయ బృందంలోని కోచ్లు, అథ్లెట్లు, సపోర్ట్ స్టాఫ్ అన్బ్రాండెడ్ దుస్తులు ధరిస్తారని ఆయన అన్నారు. అయితే దీనిపై లీ నింగ్ ఇండియా ప్రతినిధి ఇంకా స్పందన వ్యక్తం చేయలేదు.