వనపర్తి, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : సాగు, తాగు నీటికి భవిష్యత్లో ఇబ్బందుల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. స్థానికంగా జలసిరిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచడానికి చెక్డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వాగుల ద్వారా వృథాగా పోతున్న నీటిని అడ్డుకట్ట వేయనున్నారు. చెక్డ్యాం నిర్మించి కుడి, ఎడుమ కాలువలను నిర్మించి ఆయకట్టుకు నీరందించనున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో వనపర్తి జిల్లాకు 10, గద్వాలకు 3 చెక్డ్యాంలు మంజూరయ్యాయి. వనపర్తిలో మూడు చెక్డ్యాంలు పూర్తికాగా, మరో మూడు త్వరలో పూర్తికానున్నాయి. మిగతా వాటిని మార్చి 2022 వరకు పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి దశలో పూర్తయిన చెక్డ్యాంలను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించనున్నారు.
మరో 12 చెక్డ్యాంలకు ప్రతిపాదనలు..
మొదటి విడత చెక్డ్యాంలకు అదనంగా రూ.76 కోట్ల అంచనా వ్యయంతో వనపర్తి జిల్లాలో 12 చెక్డ్యాంలకు ఇరిగేషన్శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఖిల్లాఘణపురం మండలంలోని వెంకటంపల్లి, సల్కలాపురం, అప్పరెడ్డిపల్లి, కర్నెతండా, పెద్దమందడి మండలంలో వెల్టూర్, చిల్కటోనిపల్లి ప్రాంతాల్లోని వాగులపై చెక్డ్యాంలు నిర్మించనున్నారు. వీటి అంచనా వ్యయం రూ.25.34 కోట్లుగా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అదేవిధంగా మదనాపురం మండలం అజ్జకొల్లు గ్రామ సమీపంలో రెండు, నెల్వెడి ప్రాంతంలో మరో రెండు చెక్డ్యాంలు నిర్మించనున్నారు. కొత్తకోట మండలంలోని అప్పరాల వద్ద వాగులపై రెండు చెక్డ్యాంలు నిర్మించనున్నారు. ప్రతిపాదనలకు అనుమతులు లభిస్తే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు.