దోహా (ఖతార్): తాను చేసిన గోల్స్ ఎప్పుడూ లెక్కించుకోనని భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్, గోల్స్ మెషీన్ సునీల్ ఛెత్రీ చెప్పాడు. జట్టుగా తామెప్పుడూ విజయం సాధించేందుకే శ్రమిస్తామని అన్నాడు. ఫిఫా ప్రపంచకప్(2022), 2023 ఆసియాకప్ సంయుక్త క్వాలిఫయర్స్లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో డబుల్ గోల్స్తో టీమ్ఇండియాను గెలిపించిన ఛెత్రీ.. అంతర్జాతీయ గోల్స్లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీని అధిగమించాడు. ప్రస్తుతం ఆడుతున్న వారిలో 103 ఇంటర్నేషనల్ గోల్స్తో క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉండగా.. మెస్సీ(72)ని దాటేసి ఛెత్రీ (74) రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఛెత్రీ మాట్లాడాడు. తాను లెక్కలు చూసుకోనని, ఆట నుంచి నిష్క్రమించాక అప్పుడు ప్రతీగోల్ గురించి మాట్లాడుకుందామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. కాగా 36 ఏండ్ల ఛెత్రీపై భారత హెడ్కోచ్ ఇగోర్ స్టిమాక్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు 25 ఏండ్ల యువ ఆటగాడిలా ఎంతో ఉత్సాహం, సామర్థ్యంతో ఆడుతున్నాడని అన్నాడు. అత్యుత్తమాన్ని మించి రాణిస్తున్నాడని పొగిడాడు. మరోవైపు భారత మాజీ కెప్టెన్ బైచింగ్ భూటియాతో పాటు పలువురు ఆటగాళ్లు ఛెత్రీని ప్రశంసించారు.