ప్రపంచకప్ తుది జట్టులో చోటు దక్కాలంటే తప్పక సత్తాచాటాల్సిన స్థితిలో భారత ఓపెనర్లు విశ్వరూపం కనబర్చారు. ఐపీఎల్లో దంచికొట్టిన లోకేశ్ రాహుల్, ఇషాన్ కిషన్ అదే జోష్ కొనసాగిస్తూ.. ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. బంతి ఎక్కడపడ్డా దాని గమ్యస్థానం బౌండ్రీయే అన్న చందంగా వీరిద్దరూ చెలరేగిపోవడంతో వామప్ మ్యాచ్లో భారత్ బోణీ కొట్టింది. బౌలింగ్లో మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా ఆకట్టుకోగా.. రిషబ్ పంత్ సిక్సర్తో మ్యాచ్కు ముగింపు పలికి ధోనీకి తనే సరైన వారసుడినని చాటాడు!
దుబాయ్: ఓపెనింగ్ జోడీ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో వామప్ మ్యాచ్లో టీమ్ఇండియా జయకేతనం ఎగురవేసింది. టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో (49; 4 ఫోర్లు, ఒక సిక్సర్), మోయిన్ అలీ (20 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), లియామ్ లివింగ్స్టోన్ (30) రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్ (0/54) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోహ్లీసేన 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 70 రిటైర్డ్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), లోకేశ్ రాహుల్ (24 బంతుల్లో 51; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. రిషబ్ పంత్ (14 బంతుల్లో 29 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, లివింగ్స్టోన్ తలో వికెట్ పడగొట్టారు. ఇతర ప్రాక్టీస్ మ్యాచ్ల్లో వెస్టిండీస్పై పాకిస్థాన్.. అఫ్గానిస్థాన్పై దక్షిణాఫ్రికా.. న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా విజయాలు సాధించాయి.
రోహిత్కు రెస్ట్
హిట్మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించేదవరనేది తేల్చేందుకు.. అతడికి రెస్ట్ ఇచ్చి లోకేశ్ రాహుల్, ఇషాన్ కిషన్లను ఓపెనర్లుగా దింపగా.. వీరిద్దరూ తమ అటాకింగ్ గేమ్తో ఆకట్టుకున్నారు. వోక్స్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రాహుల్ 4,4,6,4 బాదగా.. తదుపరి ఓవర్లో ఇషాన్ 4,6,4 అరుసుకున్నాడు. ఫలితంగా పవర్ప్లే ముగిసేసరికి భారత్ 59/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. అలీ ఓవర్లో 4,6 కొట్టిన రాహుల్.. 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకొని మరుసటి బంతికే ఔటయ్యాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన విరాట్ కోహ్లీ (11) కాస్త నిదానంగా ఆడగా.. మరో ఎండ్ నుంచి ఇషాన్ తన దంచుడు కొనసాగించాడు. రషీద్ ఓవర్లో 6,6,4,4తో విశ్వరూపం కనబర్చిన ఇషాన్ కిషన్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలీ ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాది ఇషాన్ రిటైర్డ్ నాటౌట్గా పెవిలియన్ చేరగా.. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా (16 నాటౌట్; 3 ఫోర్లు) మిగిలిన పని పూర్తిచేశారు.
మెరిసిన షమీ
ఐపీఎల్లో సత్తాచాటి మంచి టచ్లో ఉన్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ పోరులోనూ అదే జోరు కొనసాగించారు. టాస్ గెలిచిన విరాట్ మొదట బౌలింగ్ ఎంచుకోగా.. హిట్టర్లతో కూడిన ఇంగ్లండ్ ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. మహమ్మద్ షమీ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. బుమ్రా ఓ పర్ఫెక్ట్ యార్కర్తో బెయిర్స్టోను బోల్తా కొట్టించగా.. డేవిడ్ మలాన్ (18)ను రాహుల్ చాహర్ బుట్టలో వేసుకున్నాడు. ముగ్గురు పేసర్లు ఇద్దరు స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించిన కోహ్లీ.. హార్దిక్ పాండ్యాకు ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదు. మూడో స్పిన్నర్ బెర్త్ కోసం పోటీ పడుతున్న రవిచంద్రన్ అశ్విన్ వికెట్ పడగొట్టకపోయినా పొదుపుగా బౌలింగ్ చేయగా.. రాహుల్ చాహర్ ఎక్కువ పరుగులు ఇచ్చుకున్నాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 188/5 (బెయిర్స్టో 49, మోయిన్ అలీ 43 నాటౌట్; షమీ 3/40),
భారత్: 19 ఓవర్లలో 192/3 (ఇషాన్ 70 రిటైర్డ్, రాహుల్ 51; లివింగ్స్టోన్ 1/10).