హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : కాలిఫోర్నియా, ఆక్స్ఫోర్డ్, స్టాన్ఫోర్డ్, హార్వార్డ్, చికాగో, యేల్ ఇవి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు. వరల్డ్ ర్యాంకింగ్స్లో అగ్రభాగాన ఉండే యూనివర్సిటీలు. ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ బిడ్డలు రూపాయి ఖర్చు లేకుండా నేడు చదువుకోగలగుతున్నారు. వీటి పేర్లను టీవీలు, పేపర్ల ద్వారా మాత్రమే తెలుసుకున్న వారిప్పుడు అదే యూనివర్సిటీల్లో వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. ఇలా విదేశాల్లోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదువుకొనేందుకు బంగారమో.. ఇంటిస్థలాలనో కుదువబెట్టాల్సిన అవసరంలేకుండా ఎడ్యుకేషన్ లోన్ల బాధలు లేకుండా చదువుకొని ప్రయోజకులవుతున్నారు. ఇలాంటి అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నదే రాష్ట్ర ప్రభుత్వ ‘ఓవర్సీస్ స్కాలర్షిప్స్ స్కీం’. ఇదివరకు కొందరికే పరిమితమైన ఈ పథకాన్ని ప్రభుత్వం ఇప్పుడు అన్ని కులాలు, మతాల వారికి అందజేస్తున్నది. ఎస్సీ, ఎస్టీలతోపాటు, బీసీలు, మైనార్టీలు, బ్రాహ్మణులు సైతం ఓవర్సీస్ స్కాలర్షిప్స్ పొందుతున్నారు. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి 4వేలమందికి పైగా విద్యార్థులు విదేశీ బాటపట్టారు.
బ్రాహ్మణ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.120 కోట్లు ఖర్చు చేసింది. పేద బ్రాహ్మణులను ఆదుకొనేందుకు సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ఏర్పాటుచేశారు. మాజీ ఐఏఎస్ అధికారి రమణాచారి అధ్యక్షతన ఈ పరిషత్ ద్వారా పేద బ్రాహ్మణుల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను చేపట్టారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీల తరహాలోనే బ్రాహ్మణ పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పించారు. వివేకానంద ఒవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం కింద బ్రాహ్మణ పేద విద్యార్థులకు గరిష్ఠంగా రూ. 20 లక్షల వరకు ఆర్థికసహాయం అందిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 410మంది అభ్యర్థులకు రూ. 50కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించారు. ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థుల కోసం శ్రీ రామానుజ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మెరిట్ ఆధారంగా రూ. 10,000 నుంచి గరిష్ఠంగా రూ. 50,000 వరకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. ఇప్పటివరకు 323 మందికి రూ.83,23,750 ఈ పథకం కింద లబ్ధిచేకూరింది. పేద బ్రాహ్మణ బాలికల కోసం కంచి పీఠాధిపతి స్వామి విద్యా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఐదునుంచి 12వ తరగతి వరకు బాలికలకు సీబీఎస్సీ సిలబస్లో రెసిడెన్షియల్ విద్యను అందిస్తున్నారు. వేదాల అభ్యసనకు 30 పాఠశాలలను ఏర్పాటుచేశారు. వేద పండితులను సత్కరించే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టి ఇప్పటివరకు 40 మంది పండితులకు రూ. 23 లక్షల వరకు గౌరవ వేతనాలు అందించారు. పేద బ్రాహ్మణులు వృత్తి, వ్యాపారాలు చేసుకోవడం కోసం బ్రాహ్మిణ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ (బెస్ట్) పేరుతో మరో పథకాన్ని అమలుచేస్తున్నారు. ఇప్పటివరకు 2011 మందికి రూ. 56.45కోట్ల వరకు ఆర్థిక సహాయం చేశారు. వివిధ రకాల శిక్షణ కోసం నగరానికి వచ్చే బ్రాహ్మణ యువతకు వసతి సౌకర్యం కల్పించే ఉద్దేశంతో గోపన్పల్లిలో రూ.12కోట్ల వ్యయంతో బ్రాహ్మణ సదన్ను నిర్మిస్తున్నారు. ‘అర్హుడైన చివరి వ్యక్తి వరకు సహాయం అందించేందుకు పరిషత్ సిద్ధంగా ఉన్నది. నిధులకు కొరతలేదు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉన్నది’ అని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ బోర్డు సభ్యుడు వేణుగోపాలాచారి తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ప్రవేశపెట్టి, రూ.10 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. 2016లో తెలంగాణ ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్ను రూ.20 లక్షలకు పెంచింది. మైనారిటీల కోసం 2015-16లో ‘ఓవర్సీస్ స్టడీ స్కీమ్ ఫర్ మైనారిటీస్’ను ప్రారంభించింది. పథకం పేరును 2015 జూలైలో ‘చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ మైనారిటీస్’గా మార్చారు. బీసీల కోసం మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని 2016 అక్టోబర్ 10న ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓవర్సీస్ విద్యానిధి పథకం లబ్దిదారుల కుటుంబ ఆదాయాన్ని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ 2017లో జీవోను జారీచేసింది. ఇంతకుముందు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ దేశాల్లోనే చదువుకొనే అ వకాశముండగా.. జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియాలోనూ చదివే అవకాశం కల్పించింది.