లండన్: క్రికెట్ చరిత్రలో తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఈ మధ్యే ముగిసిన విషయం తెలుసు కదా. ఇక ఇప్పుడు రెండో టెస్ట్ చాంపియన్షిప్ ప్రారంభం కాబోతోంది. ఇది 2021-2023 మధ్య జరగనుంది. దీనికోసం కొత్త పాయింట్ల వ్యవస్థను, ఏ టీమ్ ఎన్ని మ్యాచ్లు, ఎవరితో ఆడబోతోందన్న షెడ్యూల్ను ఐసీసీ రిలీజ్ చేసింది. ఈసారి కేవలం రెండు సిరీస్లలో మాత్రం ఐదు మ్యాచ్లు ఉన్నాయి.
ఇండియా, ఇంగ్లండ్ సిరీస్తోనే..
ఆగస్ట్ 4 నుంచి ఇండియా, ఇంగ్లండ్ మధ్య ప్రారంభం కాబోయే ఐదు టెస్ట్ల పటౌడీ ట్రోఫీతోనే రెండో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2లో ఈ సిరీస్తోపాటు డిసెంబర్లో జరగబోయే యాషెస్ సిరీస్లో మాత్రమే ఐదేసి టెస్టులు ఉండనున్నాయి. ఇక ఇండియా, ఆస్ట్రేలియా మధ్య 2022లో ఇండియాలో జరగబోయే సిరీస్లో మాత్రమే 4 టెస్టులు ఉన్నాయి.
ఇక ఏడు సిరీస్లలో మూడేసి టెస్టులు, 13 సిరీస్లలో రెండేసి టెస్టులు జరగనున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్, వేదికను మాత్రం ఐసీసీ ఇంకా రిలీజ్ చేయలేదు. తొలి డబ్ల్యూటీసీలాగే ప్రతి టీమ్ మొత్తం ఆరు సిరీస్లు ఆడనుంది. ఇందులో మూడు ఇంట, మరో మూడు బయట ఉంటాయి. కొవిడ్ వల్ల తొలి డబ్ల్యూటీసీలో వాయిదా పడిన సిరీస్లు రెండో డబ్ల్యూటీసీలో జరగనున్నాయి.
ఇండియా.. 9 ఇంట, 10 బయట
ఇక రెండో డబ్ల్యూటీసీలో అత్యధికంగా ఇంగ్లండ్ 21 టెస్టులు ఆడబోతోంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇండియా (19), ఆస్ట్రేలియా (18), సౌతాఫ్రికా (15) ఉన్నాయి. ఇక తొలి ఫైనల్ గెలిచిన న్యూజిలాండ్ ఇందులో 13 టెస్టులు ఆడనుంది. ఇండియా ఆడనున్న మొత్తం 19 టెస్టుల్లో సొంతగడ్డపై 9, విదేశాల్లో 10 మ్యాచ్లు ఆడాల్సి ఉంది.
పాయింట్లు ఎలా?
ఇక రెండో డబ్ల్యూటీసీలో పాయింట్లు ఎలా ఉండబోతున్నాయో కూడా ఐసీసీ వివరించింది. గెలిచిన టీమ్కు 12 పాయింట్లు కేటాయిస్తారు. టై అయితే 6, డ్రా అయితే 4 పాయింట్లు, ఓడిపోతే 0 పాయింట్లు ఇస్తారు. ఇక ఈసారి స్లో ఓవర్ రేట్కు పెనాల్టీ కూడా విధిస్తున్నారు. అలాంటి టీమ్స్కు ఒక పాయింట్ మైనస్ చేస్తారు. గతంలో టెస్టుల సంఖ్యతో సంబంధం లేకుండా సిరీస్కు 120 పాయింట్లు ఇచ్చేవారు. అయితే ఈసారి మాత్రం విజయం సాధిస్తే 12 పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డైస్ చెప్పారు.