భారత్, ఇంగ్లండ్ మధ్య మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఇంగ్లిష్ గడ్డపై చరిత్ర తిరుగరాయాలని కోహ్లీసేన పట్టుదలతో కనిపిస్తుంటే.. సొంతగడ్డపై సత్తాచాటేందుకు రూట్ గ్యాంగ్ ఉవ్విళ్లూరుతున్నది. తొలి టెస్టు గెలిచి ఐదు మ్యాచ్ల సిరీస్లో ముందంజ వేద్దామనుకున్న భారత ఆశలపై వరుణుడు నీళ్లు గుమ్మరించగా, అనుభవలేమితో ఇంగ్లండ్ కొట్టుమిట్టాడుతున్నది. శార్దుల్ ఠాకూర్, స్టువర్ట్ బ్రాడ్ గాయాలతో ఇరు జట్లు తుది ఎంపికపై తర్జనభర్జన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్టు ఆసక్తికరంగా సాగనుంది.
లండన్: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ మధురానుభూతుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న అభిమానులను భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ అలరించనుంది. క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో గురువారం నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టుకు తెరలేవనుంది. వరుణుడి అంతరాయంతో నాటింగ్హామ్ టెస్టులో గెలిచే అవకాశాన్ని కోల్పోయిన టీమ్ఇండియా..మలి టెస్టులో ఇంగ్లండ్పై పంజా విసరాలని చూస్తున్నది. ప్రతికూల పరిస్థితుల్లోనూ సత్తాచాటేందుకు కోహ్లీసేన ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నది. అయితే బ్యాటింగ్ వైఫల్యం టీమ్ఇండియాను వేధిస్తున్నది. టాపార్డర్లో కేఎల్ రాహుల్ ఫామ్లోకి రాగా మిడిలార్డర్ సమయోచిత పాత్ర పోషించడం లేదు. ముఖ్యంగా కెప్టెన్ కోహ్లీ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించడం లేదు. సీనియర్లు అయిన పుజారా, రహానే, రోహిత్శర్మ బ్యాట్లు ఝులిపించడంలో విఫలమవుతున్నారు. బౌలింగ్ విషయానికొస్తే లోయర్ ఆర్డర్లో బౌలింగ్, బ్యాటింగ్లో రాణించే సత్తా ఉన్న శార్దుల్కు గాయం కావడం తుది జట్టు ఎంపికపై ప్రభావం చూపనుంది. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా శార్దుల్ స్థానంలో అశ్విన్కు అవకాశమిస్తారా లేక..మరో పేసర్ను తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.
అండర్సన్తో కలిసి ఇంగ్లండ్ బౌలింగ్ భారాన్ని మోస్తున్న స్టువర్ట్ బ్రాడ్ గాయంతో మొత్తం సిరీస్కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో బ్రాడ్ కండరాలు పట్టేశాయి. దీంతో సిరీస్లో మిగిలిన టెస్టులకు అందుబాటులో లేకుండా పోయాడు. బ్రాడ్ గైర్హాజరీలో అండర్సన్, మార్క్ వుడ్, రాబిన్సన్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించనున్నారు. ఇదిలా ఉంటే బ్రాడ్ గాయాన్ని దృష్టిలో పెట్టుకుని లాంకషైర్ సీమ్ బౌలర్ సకీబ్ మహమూద్ను రిజర్వ్ ప్లేయర్గా తీసుకుంది. సకీబ్ చేరికతో స్పిన్నర్ డామ్ బెస్ను జట్టు నుంచి తప్పిస్తూ యార్క్షైర్కు ఈసీబీ పంపింది. ఒక వేళ పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉంటే స్పిన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నది. మొత్తంగా కెప్టెన్ రూట్ బ్యాటింగ్ భారాన్ని మోస్తుంటే.. బౌలింగ్లో అండర్సన్ పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నాడు.
భారత్: రోహిత్శర్మ, రాహుల్, పుజారా, కోహ్లీ(కెప్టెన్), రహానే, పంత్, జడేజా, అశ్విన్/ఇషాంత్, షమీ, బుమ్రా, సిరాజ్
ఇంగ్లండ్: బర్న్స్, సిబ్లే, క్రాలీ/హసీబ్ హమీద్, రూట్(కెప్టెన్), బెయిర్స్టో, బట్లర్, అలీ, కరాన్, రాబిన్సన్, వుడ్, ఓవర్టన్/సకీబ్ మహమూద్