కొత్త విద్యాసంవత్సరం షురూ
ఆన్లైన్లో విద్యార్థులకు బోధన
ఖమ్మంలో 64.5శాతం, భద్రాద్రిలో53శాతం హాజరు
తరగతులను పర్యవేక్షించిన విద్యాశాఖ అధికారులు
ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 1: బడిగంట మోగకుండా, విద్యార్థులు పాఠశాలకు హాజరుకాకుండానే కొత్త విద్యాసంవత్సరం ఆరంభమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం 3వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు విన్నారు. విద్యార్థులు దూరదర్శన్, టీ- శాట్, మొబైల్ ఫోన్ల ద్వారా పాఠాలు విన్నారు. ఎర్రుపాలెం మండలంలో నిర్వహించిన ఆన్లైన్ తరగతులను డీఈవో యాదయ్య పరిశీలించారు. జిల్లాలో తొలిరోజు హాజరుశాతం 64.5 శాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 1,285 పాఠశాలలు ఉండగా, వీటి పరిధిలో 72,836 మంది చదువుతున్నారు. గురువారం వీరిలో 46,963 మంది పాఠాలు విన్నారు. హాజరుశాతం 64.5 శాతం నమోదైంది. దూరదర్శన్, టీ- శాట్ ద్వారా 35,750 మంది, స్మార్ట్ఫోన్ల ద్వారా 10,840 మంది, ఒకేచోట ఇద్దరు విద్యార్థులు ఉండి 373 మంది పాఠాలు విన్నారు.
విద్యార్థులకు సమాచారం..
ఆన్లైన్ పాఠాల ప్రారంభమైన నేపథ్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో ఫోన్లో మాట్లాడారు. ఆన్లైన్ పాఠాలపై వారికి సలహాలు, సూచనలిచ్చారు. విద్యార్థుల మొబైల్స్కు పాఠాల లింక్ను షేర్ చేశారు. ప్రధానోపాధ్యాయులు టీచర్లను సమన్వయం చేస్తూ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తరగతులను పరీశీలించారు. టీవీలు, డీటీహెచ్లు, మొబైల్ ఫోన్లు లేని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి పాఠాలు విన్నారు.
భద్రాద్రి జిల్లాలో..
కొత్తగూడెం ఎడ్యుకేషన్, జూలై 1: భద్రాద్రి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం ఆన్లైన్ విద్యాబోధన ప్రారంభమైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ తెలిపారు. విద్యార్థులు దూరదర్శన్ యాదగిరి, టీ-శాట్ చానల్ ద్వారా పాఠాలు విన్నారన్నారు. జిల్లాలోని 1,110 పాఠశాలల్లో చదువుతున్న 47,146 మంది విద్యార్థులకు గాను తొలిరోజు 25,212 మంది పాఠాలు విన్నారన్నారు. హాజరుశాతం 53.47 శాతం నమోదైందన్నారు. తరగతులను సమన్వయకర్తలు ఎ.నాగరాజశేఖర్ పర్యవేక్షించారు. లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం పంచాయతీలోని సాటివారిగూడెంలో పర్యటించి విద్యార్థులతో మాట్లాడారు.